పీవీ సింధు రిటైర్మెంట్.. మతలబేంటి?

భారత స్టార్ షట్లర్.. నాలుగేళ్ల కిందట రియో ఒలింపిక్స్‌లో రజతం గెలిచి దేశాన్ని ఉర్రూతలూగించిన పీవీ సింధు హఠాత్తుగా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించి ఆశ్చర్యపరిచింది. సింధు వయసింకా 25 ఏళ్లే. పైగా మంచి ఫాంలోనే ఉంది. పెద్ద గాయాలేమీ అయినట్లు వార్తలు కూడా రాలేదు. అలాంటిది ఇంత త్వరగా ఆటకు టాటా చెప్పడమేంటి అని అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. కానీ రిటైర్మెంట్ విష‌యంలో పెద్ద ట్విస్టుంద‌ని ఆమె పోస్టు మొత్తం చ‌దివాక కానీ అర్థం కాలేదు.

కరోనా కారణంగా ఐదారు నెలల పాటు సింధు ఇల్లు దాటి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో రాకెట్ పట్టే అవకాశమే లేకపోయింది. ఐతే ఆ తర్వాత ప్రాక్టీస్ మొదలుపెట్టినా అది సజావుగా సాగలేదు. పైగా కరోనాకు సంబంధించిన జాగ్రత్తలు, నియమాలు ప్రాక్టీస్ దగ్గర సరిగా పాటించలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు కరోనా విరామం తర్వాత షెడ్యూల్ అయిన టోర్నీలు ఒకదాని తర్వాత ఒకటి రద్దవుతూ వచ్చాయి. ఈ నేప‌థ్యంలోనే మ‌ళ్లీ కోర్టులోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ టోర్నీలు మాత్రం ఆడ‌లేక‌పోయింది సింధు. ఐతే అనిశ్చితి నుంచి త్వ‌ర‌లోనే బ‌య‌టికి వ‌చ్చి జ‌న‌వ‌రిలో జ‌రిగే ఆసియా ఓపెన్‌లో ఆడ‌బోతున్న‌ట్లు సింధు ప్ర‌క‌టించింది.

క‌రోనా వ‌ల్ల డెన్మార్క్ ఓపెన్‌కు దూరం కావ‌డాన్ని ప్ర‌స్తావిస్తూ.. అలా దూర‌మైన టోర్నీ అదే చివ‌రిద‌ని.. ఇక‌పై భ‌యం, అనిశ్చితి లాంటి ప‌రిస్థితుల నుంచి రిటైర్ అవ‌బోతున్నాన‌ని.. తిరిగి ఆసియా ఓపెన్‌తో తాను ఆట‌లోకి అడుగు పెట్ట‌బోతున్నాన‌ని.. త‌న ఉద్దేశాన్ని అంద‌రూ జాగ్ర‌త్త‌గా అర్థం చేసుకోవాల‌ని సింధు పోస్టు చివ‌రిలో ప్ర‌క‌టించింది. అంటే సింధు నిజంగా ఏమీ ఆట నుంచి రిటైర్ కావ‌ట్లేద‌న్న‌మాట‌. భ‌యాన్ని, అనిశ్చితిని వీడి తిరిగి ఆట‌లోకి రాబోతున్న విష‌యాన్ని ఇలా ఒక ట్విస్టు ద్వారా చెప్పింది. కానీ ఐ రిటైర్ అని హెడ్డింగ్ పెట్టి మొద‌ట్లో అంతా అసంతృప్త స్వ‌రం వినిపించ‌డంతో ఆమె ఆట‌కు టాటా చెప్పేస్తోంద‌ని అంద‌రూ త‌ప్పుగా అనుకున్నారు.