ఆసుపత్రి పాలైన అలేఖ్య చిట్టి

గత వారం రోజులుగా అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యవహారం సోషల్ మీడియాను ఎలా ఊపేస్తోందో తెలిసిందే. పచ్చళ్ల రేట్లు ఎక్కువ అని ప్రస్తావించినందుకు ఓ కస్టమర్‌ను అలేఖ్య చిట్టి దారుణమైన బూతులు తిట్టేయడం.. ఆ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయి తీవ్రమైన వ్యతిరేకత రావడం.. పాత ఆడియోలు, వీడియోలు సైతం బయటికి వచ్చి అలేఖ్య చిట్టి సిస్టర్స్‌ను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేయడం.. ఫలితంగా వాళ్ల బిజినెస్సే మూత పడే పరిస్థితి రావడం తెలిసిందే.

ఈ విషయంలో ముందే బేషరతుగా క్షమాపణ చెప్పేస్తే సరిపోయేది. కానీ అటు వైపు నుంచి అది జరక్కపోవడంతో ట్రోలింగ్ తీవ్ర స్థాయికి చేరుకుంది. దీంతో పరిస్థితి చేజారిపోతోందని అర్థమై అలేఖ్య చిట్టి క్షమాపణ చెప్పింది. ఆమె ఏడుస్తున్న వీడియోలు సైతం వైరల్ అయ్యాయి. అయినా కూడా ట్రోలింగ్ ఆగకపోవడంతో ఇప్పుడు ఆమె ఆసుపత్రి పాలయ్యే పరిస్థితి వచ్చిందట.

అలేఖ్య చిట్టి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. తన చెల్లిని ఆ పరిస్థితుల్లో చూపిస్తూ సిస్టర్స్‌ అందరిలోకి పెద్దదైన సుమ ఒక వీడియో చేశారు. తన సోదరి తప్పు ఒప్పుకుని సారీ చెప్పినా కూడా సోషల్ మీడియా జనాలు ట్రోలింగ్ ఆపట్లేదని.. ఇన్‌స్టా సహా పలు చోట్ల ఆమెను దారుణంగా టార్గెట్ చేస్తూ మానసిక క్షోభకు గురి చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో తన చెల్లికి ఆక్సిజన్ పెట్టి చికిత్స చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

తమ బిజినెస్ మూత పడినా, ఇంకేం జరిగినా పర్వాలేదని.. కానీ అలేఖ్యను బతకనివ్వాలని ఆమె వేడుకున్నారు. మూడు నెలల కిందటే తమ తండ్రి చనిపోయాడని, దీంతో అందరం బాధలో ఉన్నామని.. ఇంట్లో ఇంకో ప్రాణం పోతే తట్టుకోలేమని ఆమె ఆవేదన స్వరంతో చెప్పారు. ఈ వీడియో చూసిన వాళ్లందరూ.. ఇక అలేఖ్య చిట్టిని టార్గెట్ చేయడం ఆపేయాలన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.