నాలుగు కాదు… ఆరింటి భర్తీకి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టేనా?

తెలంగాణ కేబినెట్ విస్తరణ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తోంది. ఇప్పటికే మొన్నామధ్య సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ల ఢిల్లీ పర్యటన సందర్భంగా కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న ఆరు ఖాళీల్లో నాలుగింటిని మాత్రమే భర్తీ చేసుకునేందుకు అనుమతించిన అధిష్ఠానం.. మరో రెండు పదవులను అలా కొంతకాలం పాటు ఖాళీగానే ఉంచాలని సూచించినట్టు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా గురువారం తమను కలిసిన టీపీసీసీ నేతలతో మాట్లాడిన సందర్భంగా మొత్తం ఆరు మంత్రి పదవులను భర్తీ చేసుకునేందుకు పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కొత్తగా భర్తీకి అనుమతిచ్చిన పోస్టులు రెండూ బీసీ వర్గాలకు చెందిన నేతలకు ఇచ్చే దిశగా ఓ నిర్ణయం అయితే జరిగిందని సమాచారం.

తెలంగాణలో ఇటీవలే జరిగిన కుల గణన ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం అనుమతి ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ టీ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో భారీ ప్రదర్శనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రదర్శనకు సీఎం రేవంత్ సహా టీపీసీసీ చీఫ్: మహేశ్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, పార్టీ పెద్దలు పెద్ద సంఖ్యలోనే హాజరు అయ్యారు. వీరంతా గురువారం కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఈ సందర్భంగా వారంతా గురువారం సోనియా గాంధీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తాము చేపట్టిన కుల గణన, దానికి అనుగుణంగా చేపట్టిన చర్యలు, బీసీల రిజర్వేషన్ల పెంపు దిశగా తీసుకుంటున్న చర్యలు తదితరాలపై వారంతా సోనియాతో చర్చించారు. ఈ మొత్తం వివరాలను విన్న సోనియా గాంధీ మంచి పని చేస్తున్నారని టీ కాంగ్ నేతలను భుజం తట్టారు. అంతేకాకుండా ఇలాంటి చర్యలు పార్టీకి ఎంతగానో ఉపయోగపడతాయని కూడా ఆమె మెచ్చుకున్నారట.

ఈ సందర్భంగా కేబినెట్ విస్తరణను ప్రస్తావించిన మహేశ్ కుమార్ గౌడ్… ఎలాగూ కేబినెట్ విస్తరణ ఇంకా జరగని నేపథ్యంలో ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవులను భర్తీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారట. అదే సమయంలో ఇప్పటికే అనుమతి ఇచ్చిన 4 మంత్రి పదవులను పక్కనబెడితే… కొత్తగా భర్తీ చేయబోయే రెండు మంత్రి పదవులను బీసీలకే ఇస్తే.. పార్టీకి మంచి మైలేజీ లభిస్తుందని కూడా ఆయన చెప్పారట. ఈ ప్రతిపాదనను విన్న సోనియా గాంధీ ప్రతిపాదన బాగానే ఉందని అభిప్రాయపడ్డారట. అదే సమయంలో ఈ విషయాన్ని రాహుల్ గాంధీతో పాటు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోనూ చర్చించి ముందుకు సాగండని సూచించారట. దీంతో రాహుల్, ఖర్గేల వద్ద కూడా ఈ విషయాన్ని ప్రస్తావించగా… వారు కూడా ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని నేరుగా బయటపెట్టని మహేశ్ కుమార్ గౌడ్… తాము చేసిన ప్రతిపాదనకు అధిష్ఠానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని మాత్రం చెప్పారు. ఈ లెక్కన మంత్రివర్గ విస్తరణలో ఖాళీగా ఉన్న ఆరు పదవులను భర్తీ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. మరి ఈ బీసీ కోటా రెండు మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయన్న విషయంపై ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర లేసింది.