ఇండియా – పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో జరిగే ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఫిబ్రవరి 23న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ టికెట్లు అమ్మకానికి పెట్టిన క్షణాల్లోనే పూర్తిగా అమ్ముడుపోయాయి. ఆన్లైన్ బుకింగ్ ప్రారంభమైన వెంటనే 1.5 లక్షల మందికి పైగా ఫ్యాన్స్ క్యూలో ఉండడం విశేషం. గందరగోళం మధ్య గంటకు పైగా వెయిటింగ్ సమయం పడినా, చాలా మంది టికెట్లు దక్కించుకోలేకపోయారు.
టికెట్ల డిమాండ్ అంతగా ఉండటంతో కొన్ని కేటగిరీల ధరలు లక్ష రూపాయలకు పైగా ఉన్నా కూడా, వాటిని కూడా అభిమానులు కొనుగోలు చేశారు. ఈ మ్యాచ్కు టికెట్లు దొరకకపోవడంతో చాలా మంది నిరాశ చెందారు. ప్లాటినం టికెట్ ధర దిర్హాం 2,000 (దాదాపు రూ.47,434) కాగా, గ్రాండ్ లౌంజ్ టికెట్ ధర దిర్హాం 5,000 (సుమారు రూ.1.8 లక్షలు) ఉండటం గమనార్హం. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ప్రేక్షకుల లోకానికి ఓ పండుగ. గతంలో జరిగిన వన్డే ప్రపంచకప్, టీ20 వరల్డ్ కప్ మ్యాచుల డిమాండ్ను మించిన ఆసక్తిని ఈ మ్యాచ్ సాధించింది.
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో కేవలం 25,000 మందికే కూర్చునే అవకాశం ఉండటంతో టికెట్ల పోటీ తీవ్రమైంది. మ్యాచ్ జరిగే వారంలో దుబాయ్లో హోటళ్లు, విమాన టికెట్ల ధరలు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. హోటల్ బుకింగ్లు, టూరిజం వ్యాపారంలో గణనీయమైన వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్, యూఏఈ కలిసి హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తున్నాయి.
మొత్తం 15 మ్యాచ్లు 19 రోజులపాటు జరుగుతాయి. గ్రూప్-Aలో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లుంటే, గ్రూప్-Bలో ఆఫ్ఘనిస్థాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు పోటీపడనున్నాయి. ఈ టోర్నమెంట్లో పాకిస్థాన్ డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతోంది. 2017లో ఇంగ్లాండ్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్ గెలుచుకుంది.
ఇప్పటి వరకు భారత్, ఆస్ట్రేలియా జట్లు రెండుసార్లు ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నాయి. 1996 ప్రపంచకప్ తర్వాత తొలిసారి పాకిస్థాన్ అంతర్జాతీయ టోర్నమెంట్కు హోస్ట్గా వ్యవహరిస్తోంది. ఇక అత్యంత ఆసక్తికరమైన ఇండియా పాక్ మ్యాచ్ కోసం అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.