విజ‌య్ సేతుప‌తి స‌ర‌స‌న క‌త్రినా కైఫ్‌

ఒక‌ప్ప‌టితో పోలిస్తే ఇప్పుడు వివిధ భాష‌ల సినీ ప‌రిశ్ర‌మ‌ల మ‌ధ్య హ‌ద్దులు చెరిగిపోయాయి. బాలీవుడ్ న‌టీన‌టులు త‌ర‌చుగా ద‌క్షిణాది చిత్రాల్లో న‌టిస్తున్నారు. సౌత్ ఆర్టిస్టులు వెళ్లి బాలీవుడ్ చిత్రాల్లో త‌ళుక్కుమంటున్నారు. ఇక ద‌క్షిణాదిన ఉన్న సినీ ప‌రిశ్ర‌మ‌ల్లో అయితే అస‌లే ఈ హ‌ద్దులు లేవు. ఒక భాషకు చెందిన ఆర్టిస్టులు ఇంకో భాష‌లో తెర‌కెక్కుతున్న సినిమాల్లో న‌టించ‌డం కొత్తేమీ కాదు కానీ.. ఈ ఒర‌వ‌డి ఇప్పుడు బాగా పెరుగుతోంది.

ఈ క్ర‌మంలోనే బాలీవుడ్లో ఒక ఆశ్చ‌ర్య‌క‌ర కాంబినేష‌న్లో సినిమా సెట్ అయింది. ఆ క‌ల‌యిక ఎవ్వ‌రూ ఊహించనిద‌నే చెప్పాలి. బాలీవుడ్ టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రైన క‌త్రినా కైఫ్‌కు జోడీగా త‌మిళ విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తి న‌టించనుండ‌టం విశేషం. జానీ గ‌ద‌ర్, బ‌ద్లాపూర్, అంధాదున్ లాంటి వైవిధ్య‌మైన థ్రిల్ల‌ర్ సినిమాల‌తో గొప్ప పేరు సంపాదించిన శ్రీరామ్ రాఘ‌వ‌న్ ఈ చిత్రాన్ని రూపొందించ‌నుండ‌టం విశేషం.

అంధాదున్ త‌ర్వాత శ్రీరామ్‌పై భారీగా అంచ‌నాలు పెరిగిపోయాయి. కానీ ఈ చిత్రం త‌ర్వాత శ్రీరామ్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. బాగా క‌స‌ర‌త్తు చేసి త‌న కొత్త సినిమాకు స్క్రిప్టు రెడీ చేశాడు. మెర్రీ క్రిస్మ‌స్ పేరుతో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. క‌త్రినా, విజ‌య్ సేతుప‌తి జోడీని జంట‌గా ఊహించుకోవ‌డ‌మే కష్టం.

అంత చిత్రంగా అనిపించే కాంబినేష‌న్ ఇది. మ‌రి ఈ క‌ల‌యిక‌లో శ్రీరామ్ ఎలాంటి సినిమా తీస్తాడ‌న్న‌ది ఆస‌క్తి రేకెత్తిస్తోంది. త‌న సినిమాలో ముఖ్య పాత్ర‌ల‌కు విజ‌య్, క‌త్రినా త‌ప్ప వేరే ఛాయిసే క‌నిపించ‌లేద‌ని అంటున్నాడు శ్రీరామ్. ర‌మేష్ తౌరాని ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాడు. ప్ర‌ధానంగా హిందీలో ఈ సినిమాను తెర‌కెక్కించి తెలుగు, త‌మిళంలోనూ దీన్ని అనువాదం చేయ‌నున్నార‌ట‌. వ‌చ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.