కేసీఆర్‌కు గుడ్ న్యూస్ చెప్పిన సుప్రీంకోర్టు

ల్యాంకోహిల్స్‌… ఒక‌ప్పుడు ఈ పేరు హైద‌రాబాద్ రియ‌ల్ ఎస్టేట్ మార్కెట్లో ఓ సంచ‌ల‌నం. అయితే, అదే రీతిలో వివాదాస్ప‌దంగా కూడా మారింది. ప్ర‌భుత్వానికి – వ‌క్ఫ్ బోర్డుకు మ‌ధ్య ఈ భూముల యాజ‌మాన్య హ‌క్కుల విష‌యంలో ఏర్ప‌డిన పేచీ వ‌ల్ల‌ హైద‌రాబాద్‌లోని మ‌ణికొండలో ఏర్పాటైన ఈ భారీ ట‌వ‌ర్స్ భూములు వివాదంలో చిక్కుకున్నాయి.

అయితే, ఈ భూముల కేసులో సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. 1654.32 ఎక‌రాలు తెలంగాణ ప్ర‌భుత్వానివే అని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. మ‌ణికొండ జాగీర్ భూముల‌పై త‌మ‌కే హ‌క్కు ఉంద‌ని వ‌క్ఫ్ బోర్డ్ వాదించింది. దీనిపై రాష్ట్ర ప్ర‌భుత్వం, వ‌క్ఫ్ బోర్డు మ‌ధ్య‌ హైకోర్టులో వాదోప‌వాదాలు సాగాయి. 2012, ఏప్రిల్ 3న వ‌క్ఫ్ బోర్డుకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై తెలంగాణ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది.

సుదీర్ఘ వాదోప‌వాదాల అనంత‌రం మ‌ణికొండ‌ భూముల విష‌యంలో గ‌తంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ప‌క్క‌న పెట్టేసింది. ఆ తీర్పును సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం కొట్టేసింది. జ‌స్టిస్ హేమంత్ గుప్తా బెంచ్ 156 పేజీల తీర్పును నేడు వెలువ‌రించింది. మొత్తం భూముల‌పై స‌ర్వ‌హ‌క్కులు తెలంగాణ ప్ర‌భుత్వానివే అని కోర్టు పేర్కొంది.

ఎన్నో ఏళ్లుగా ప్ర‌భుత్వానికి, వ‌క్ఫ్ బోర్డు మ‌ధ్య వివాదానికి తెర‌దించుతూ వెలువ‌రించిన ఈ తీర్పులో ఇనామ్ భూముల చెల్లింపులు పెండింగ్ ఉంటే 6 నెల‌ల్లో చెల్లించాల‌ని కోర్టు ఆదేశించింది. భూముల స్వాధీనంలో వ‌క్ఫ్ బోర్డు ఇష్టారీతిలో వ్య‌వ‌హ‌రించ‌డం కుద‌ర‌ద‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. వ‌క్ఫ్ భూముల‌ని భావిస్తే ఆధారాల‌తో నోటీసులు ఇవ్వాల‌ని కోర్టు సూచించింది. స‌ర్వే నివేదిక‌ను ప్ర‌భుత్వానికి ఇవ్వాల‌ని ఆదేశించింది. భూములు వ‌క్ఫ్ బోర్డువ‌ని తేలితే రూ. 50 వేల కోట్లు క‌డుతామ‌ని తెలంగాణ ప్ర‌భుత్వం తెలిపింది.