జక్కన్న లేకుండానే ఆ స్థాయిని అందుకుంటాడా?

రీజనల్ స్థాయిలో సూపర్ స్టార్లుగా ఉన్న హీరోలందరికీ పాన్ ఇండియా స్టార్లుగా వెలిగిపోవాలని ఉంటుంది. అందులోనూ ‘బాహుబలి’తో ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో తిరుగులేని స్టార్‌గా ఎదిగిన నేపథ్యంలో అందరికీ ఆ స్థాయిని అందుకోవాలని ఉంది. ‘ఆర్ఆర్ఆర్’తో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సైతం పాన్ లెవెల్‌కు ఎదుగుతారనే అంచనా ఉంది. రేప్పొద్దున రాజమౌళితో సినిమా చేశాక మహేష్ బాబు రేంజ్ కూడా మారిపోవచ్చు. ఇలా రాజమౌళితో జట్టు కట్టిన ప్రతి హీరో రీజనల్ నుంచి నేషనల్ లెవెల్‌కు ఎదిగిపోవడం పక్కా అన్న అభిప్రాయం బలపడిపోయింది.

ఐతే టాలీవుడ్లో ఒక పెద్ద హీరో మాత్రం రాజమౌళితో సినిమా చేయకముందే పాన్ ఇండియా లెవెల్‌కు ఎదిగిపోవడానికి పక్కా ప్రణాళికలతో అడగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆ హీరోనే.. అల్లు అర్జున్.

అనుకోకుండా కేరళలో తనకు వచ్చిన ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంటూ అక్కడ మార్కెట్‌ను బాగా విస్తరించాడు బన్నీ. కేరళలో అతడి సినిమాలు రిలీజైనపుడు క్రేజ్ చూస్తే మతి పోతుంటుంది. ఇప్పటిదాకా కేరళలో రిలీజైన అతడి సినిమాలన్నీ ఒకెత్తయితే.. ఇప్పుడు ‘పుష్ప’తో అక్కడ మరో స్థాయిని చూడబోతున్నామన్నది అక్కడి ట్రేడ్ వర్గాల మాట. గత సినిమాల మాదిరి ముందు తెలుగులో రిలీజయ్యాక.. లేటుగా కేరళలో రిలీజ్ చేయట్లేదు. నేరుగా మలయాళంలోనూ ఒకేసారి విడుదల చేస్తుండటంతో ‘పుష్ప’పై అంచనాలు ఒక రేంజ్‌లో ఉన్నాయి.

కర్ణాటకలో మిగతా మెగా హీరోల్లాగే బన్నీకి ఆల్రెడీ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక తమిళనాట లైకా ప్రొడక్షన్స్, హిందీలో ఏఏ ఫిలిమ్స్ లాంటి పెద్ద సంస్థలు ‘పుష్ప’ను రిలీజ్ చేస్తున్నాయి. అన్ని చోట్లా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. సోషల్ మీడియా పీఆర్ కూడా మామూలుగా లేదు. అన్ని చోట్లా సినిమాకు మంచి హైప్ తీసుకురావడంలో, రిలీజ్ ప్లాన్స్ గట్టిగా చేయడంతో ‘పుష్ప’కు మంచి టాక్ వస్తే పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే రాజమౌళి అండ లేకుండానే పాన్ ఇండియా స్టార్ అయిన రీజనల్ హీరోగా బన్నీ చరిత్ర సృష్టిస్తాడేమో.