వంద కోట్లతో వైఆర్‌‌ఎఫ్‌ వెబ్ సిరీస్‌

బాలీవుడ్‌లో యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌‌కి ఉన్న స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినీ పరిశ్రమలో ఎన్నో సంచలనాలు సృష్టించిన సంస్థ అది. యశ్‌ చోప్రా తీసిన అద్భుతమైన సినిమాలు ఆ బ్యానర్‌‌ని తిరుగులేని స్థాయికి చేర్చాయి. ఆ లెగసీని ఆయన కొడుకు ఆదిత్య చోప్రా కొనసాగిస్తున్నారు. తమ సంస్థను మరో లెవెల్‌కి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. వాటిలో వైఆర్‌‌ఎఫ్‌ ఓటీటీ ఒకటి.

కరోనా వచ్చాక థియేటర్లు మూతబడ్డాయి. దాంతో ఓటీటీలు జెండా ఎగరేశాయి. సినిమాల పరిశ్రమ స్తంభించిపోయినా ప్రేక్షకుడు ఎంటర్‌‌టైన్‌మెంట్ మిస్ కాలేదంటే దానికి కారణం ఓటీటీలే. వాటి ప్రాధాన్యతను గుర్తించడం వల్లే అల్లు అరవింద్ లాంటి టాప్‌ నిర్మాత తెలుగులో ఆహాను నెలకొల్పారు. ఇప్పుడు ఆదిత్య చోప్రా కూడా అదే ప్లాన్స్‌లో ఉన్నారు. అయితే ఆయన ప్రణాళికలు కాస్త షాకింగ్‌గానే ఉన్నాయి.

వైఆర్‌‌ఎఫ్ ఓటీటీని ఐదొందల కోట్ల పెట్టుబడితో మొదలుపెడుతున్నారు ఆదిత్య. మొట్టమొదటి ప్రాజెక్ట్‌ను చాలా ప్రెస్టీజియస్‌గా తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకోసం ఓ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్‌ థ్రిల్లర్ స్టోరీని ఎంచుకున్నారట. ఆదిత్య భార్య రాణీముఖర్జీ ప్రధాన పాత్రలో నటించిన ‘మర్దానీ 2’ని డైరెక్ట్‌ చేసిన గోపీ పుత్రన్‌కి దర్శకత్వ బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. ఈ వెబ్ సిరీస్‌ కోసం వంద కోట్లు పెడుతున్నారట ఆదిత్య.

భోపాల్ నేపథ్యంలో సాగే ఈ కథలో నలుగురు ఫేమస్ బాలీవుడ్ హీరోలు నటిస్తారట. వారిలో ఒకరు కచ్చితంగా స్టార్ హీరోనే అయ్యుండాలని ఆదిత్య అనుకుంటున్నారట. రాణీ ముఖర్జీ కూడా ఈ సిరీస్‌తోనే డిజిటల్ ఎంట్రీ ఇస్తుందని టాక్. డిసెంబర్లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్ రానుంది. ఇవన్నీ చూస్తుంటే ఆదిత్య ఓటీటీని ఎంత సీరియస్‌గా తీసుకున్నారో అర్థమవుతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే డిజిటల్ ప్రపంచంలో ఇదో సంచలనం అవుతుంది.