అడివి శేష్ కాంప్రమైజ్ అవుతాడా..?

యంగ్ హీరో అడివి శేష్ ‘మేజర్’ అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. 2008 ముంబై ఎటాక్స్ లో మృతి చెందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కొన్ని కారణాల వలన అడివి శేష్ ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. రీసెంట్ గానే తిరిగి షూటింగ్ మొదలుపెట్టారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ షూటింగ్ చివరిదశలో ఉంది. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మిగిలిన భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది.

వచ్చే ఏడాది వాలెంటైన్స్ వీక్ లో సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు సడెన్ గా రవితేజ ఆయన నటించిన ‘ఖిలాడి’ సినిమాను అదే సమయానికి రిలీజ్ చేస్తున్నట్లు చెప్పి సర్ప్రైజ్ చేశారు. ఫిబ్రవరి 4న ‘ఆచార్య’ ఉండడంతో వారం గ్యాప్ ఇచ్చి ఫిబ్రవరి 11న రవితేజ ‘ఖిలాడి’ను రిలీజ్ చేయబోతున్నారు. రవితేజ ప్లానింగ్ బాగానే ఉన్నప్పటికీ.. దాని కారణంగా ఇప్పుడు అడివి శేష్ ఇబ్బందుల్లో పడ్డాడు. పోనీ రవితేజకి పోటీగా రిలీజ్ చేస్తామంటే.. అసలే తెలుగు సినిమా మార్కెట్ అంతంతమాత్రంగా ఉంది.

ఏపీలో టికెట్ రేట్ ఇష్యూ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఇలాంటి సమయంలో మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న రవితేజ సినిమాతో పోటీ పడి కలెక్షన్స్ షేర్ చేసుకోవడమంటే నిర్మాతలకు వర్కవుట్ కాదు. కానీ ఆలస్యం చేస్తే మరిన్ని పెద్ద సినిమాలతో పోటీ పడాల్సి వస్తుంది. ఈ విషయంలో అడివి శేష్ అండ్ టీమ్ డైలమాలో పడిందట. ప్రస్తుతానికైతే.. సినిమాను వాయిదా వేసే ఆలోచనను పక్కన పెట్టింది. ఫ్యూచర్ లో మారితే మారొచ్చు. శశి కిరణ్ తిక్క డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాని సోనీ పిక్చర్స్, జి మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ కలిసి నిర్మిస్తున్నాయి.