హీరోలు నాతో యాక్ట్ చేయరు

ఒకప్పుడు తెలుగులో గ్లామర్ డాల్‌గా మాత్రమే కనిపించిన తాప్సీ.. ఇప్పుడు బాలీవుడ్‌లో ఉమన్ సెంట్రిక్ సినిమాలకి కేరాఫ్‌గా మారింది. హీరోలతో పని లేకుండా తన చుట్టూ తిరిగే కథల్ని ఎంచుకుని హిట్లు కొడుతోంది. వంద కోట్ల క్లబ్బులో చేరిన సినిమాలు చాలానే ఉన్నాయి తాప్సీ ఖాతాలో. ప్రస్తుతం తను సౌత్‌లో చేస్తున్న జన గణ మన, మిషన్ ఇంపాజిబుల్ మాత్రమే మామూలు చిత్రాలు. నార్త్‌లో చేస్తున్న రష్మి రాకెట్, లూప్ లపేటా, దొబారా, ఏలియన్, శభాష్ మిథూ, బ్లర్‌‌.. ఇవన్నీ ఫిమేల్ సెంట్రిక్ మూవీసే.

వీటిలో ‘రష్మి రాకెట్’ ఈ నెల 15న జీ5లో రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ మూవీని ప్రమోట్ చేసే పనిలో ఉంది తాప్సీ. ఈ క్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘మొదట్నుంచీ హీరోయిన్లకు తొంభై శాతం ఇంపార్టెన్స్ లేని పాత్రలే ఇస్తూ వచ్చారు. ఎన్నో యేళ్లు ఇది కొనసాగింది. కానీ ఇప్పుడు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా సత్తా చాటుతున్నాయి. అయితే ఇలాంటి సినిమాల్లో నటించడానికి హీరోలు ఒప్పుకోరు. వాళ్ల సినిమాల్లో మాకు అంత ప్రాధాన్యత లేదని తెలిసినా మేం నటిస్తాం. కానీ వాళ్లు మాత్రం నో అంటారు. ముఖ్యంగా పెద్ద హీరోలెవరూ నాతో నటించడానికి ఇష్టపడటం లేదు. గతంలో నాతో యాక్ట్ చేసిన ఓ హీరో కూడా ఇటీవల నో చెప్పాడు’ అని మొహమాట లేకుండా చెప్పింది తాప్సీ.

బ్యాగ్రౌండ్‌ లేనివాళ్లని ఔట్ సైడర్స్‌ పేరుతో వేరుచేసే బాలీవుడ్‌లో ఓ హీరోయిన్‌ ఇంత ధైర్యంగా మాట్లాడటం నిజంగా గొప్ప విషయం. హీరోల కోసం తన పాత్ర ఇంపార్టెన్స్‌ని తగ్గించడం, ఫీలవుతారేమోనని భయపడి యంగ్‌ హీరోలతో యాక్ట్ చేయడానికి తన రెమ్యునరేషన్ తగ్గించుకోమని అడగడం వంటివి నచ్చకే హీరో ఓరియెంటెడ్ మూవీస్ చేయడం మానేశానని గతంలో చెప్పింది తాప్సీ. అందుకే తనకి హీరోలతో పని లేదని ప్రూవ్ చేయడానికే ఇలాంటి సినిమాలు చేస్తున్నానని కూడా అంది. ఆమె నిర్ణయం కరెక్టే అయ్యింది. అందుకే ఇవాళ ఆమె చేతిలో ఇన్ని సినిమాలున్నాయి. అవన్నీ ఆమె మీదే డిపెండ్ అయి ఉన్నాయి. తాప్సీ స్థాయి ఏంటో చూపిస్తున్నాయి.