విభజన చట్టానికే కేసీయార్ తూట్లు

ఏ విభజన చట్టం ద్వారా అయితే సమైక్య రాష్ట్రం రెండుగా విడిపోయి తెలంగాణా ఏర్పడిందో అదే చట్టాన్ని కేసీయార్ తుంగలో తొక్కేశారు. రాష్ట్ర విభజన చట్టప్రకారం ఏపి-తెలంగాణాకు హైదరాబాద్ 10 ఏళ్ళ ఉమ్మడి రాజధాని. ఇప్పటికి ఏడేళ్ళు గడిస్తే ఇంకా మూడేళ్ళు బ్యాలెన్స్ ఉంది. ఉమ్మడి రాజధాని అయినా కాకపోయినా హైదరాబాద్ కు రావద్దని చెప్పే హక్కు టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదని హైకోర్టు స్పష్టంగా చెప్పింది.

దేశంలో ఏ రాష్ట్రంలోను లేని ఉత్తర్వులు తెలంగాణా అమలుచేయటం ఏమిటని నిలదీసినా ప్రభుత్వం తీరు మారలేదు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు కోర్టు థిక్కారం కేసును నమోదు చేస్తామని హెచ్చరించినా ప్రభుత్వం లెక్కచేయలేదు. క్షేత్రస్ధాయిలో పోలీసులను సరిహద్దుల దగ్గర మోహరించి కరోనా వైరస్ కారణంగా వైద్యంకోసం హైదరాబాద్ వస్తున్న అంబులెన్సులను నిలిపేస్తున్నారు.

శుక్రవారం రాత్రి 9.3 గంటల తర్వాత అనుమతిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే అన్నీ అంబులెన్సులను అనుమతించటంలేదని కూడా చెబుతున్నారు. నిజానికి ఇలా అంబులెన్సులను నిలిపేయటం చాలా తప్పని అన్నీ వర్గాలు మొత్తుకున్నాయి. చివరకు హైకోర్టు కూడా ఇదే విషయాన్ని తేల్చిచెప్పింది. ఎంతమంది చెప్పినా, హైకోర్టు ఆదేశించినా కేసీయార్ ప్రభుత్వం పట్టించుకోలేదు. మొదటి రెండు రోజులు అనధికారికంగానే అంబులెన్సులను నిలిపేశారు. తర్వాత ప్రత్యేకంగా సర్క్యులర్ ఇచ్చారు.

అయితే తెలంగాణా ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ ను హైకోర్టు స్టే ఇచ్చింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నీటి వివాదాలు, నీటి ప్రాజెక్టుల నిర్మాణాల వివాదాలు, ఆస్తులు-అప్పుల విభజన లాంటి అంశాలు, సమస్యలు వచ్చినపుడు తెలంగాణా ప్రభుత్వం విభజన చట్టాన్నే తెర మీదకు తెస్తోంది. తనకు అవసరం లేనపుడు అంతా తనిష్టం అన్నట్లుగా వ్యవహరిస్తోంది.

రేపేదైనా అవసరం వచ్చినపుడో లేకపోతే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే తెలంగాణా భక్తులను ఏపిలోకి లేకపోతే తిరుపతిలోకి రానిచ్చేది లేదని ఏపి ప్రభుత్వం అంటే అప్పుడు తెలంగాణా వాళ్ళకు ఎలాగుంటుంది ? సదస్సులు, సమావేశాల్లో హైదరాబాద్ ను ప్రపంచానికే మెడికల్ హబ్ అని పదే పదే చెప్పుకునే ప్రభుత్వం అవసరానికి వస్తున్న పొరుగు రాష్ట్రం జనాలనే రానివ్వకపోవటం మాత్రం దారుణమనే చెప్పాలి.