మళ్లీ దొరికిపోయిన కంగనా

లాక్ డౌన్ టైంలో ఇండియాలో సోనూ సూద్ తర్వాత ఎక్కువగా వార్తల్లో నిలిచిన ఫిలిం సెలబ్రెటీ అంటే కంగనా రనౌత్ అనే చెప్పాలి. కాకపోతే సోనూలా మంచి పనులతో ఆమె వార్తల్లో నిలవలేదు. అనేక వివాదాలతోనే ఆమె ‘న్యూస్’గా మారింది. తాను ఎదిగిన ఇండస్ట్రీ మీదే ఆమె అనేక ఆరోపణలు చేస్తోంది ఈ మధ్య.

తనకంటూ ఒక గుర్తింపు లేని సమయంలో అందరిలో ఒకరిలా ఉన్న కంగనా.. ఇప్పుడు మాత్రం తాను వేరు అన్నట్లు వ్యవహరిస్తోంది. కొందరిని అదే పనిగా టార్గెట్ చేసి ఆరోపణలు గుప్పిస్తోంది. ఐతే ఈ క్రమంలో ఆమె కొన్నిసార్లు శ్రుతిమించిపోతుండటంతోనే సమస్య వస్తోంది. తాను చేసిన తప్పుల్ని కప్పి పుచ్చేసి అవతలి వాళ్లను నిందించాలని చూడటంతో కంగనా తరచుగా సోషల్ మీడియాకు టార్గెట్ అవుతోంది.

ఈ మధ్య కంగనా బాలీవుడ్లో డ్రగ్ రాకెట్ గురించి ఎన్నో ఆరోపణలు చేసింది. ఇండస్ట్రీ మొత్తం డ్రగ్స్ మయం అయిపోయిందని అంది. చాలామంది మీద ఆరోపణలు చేసింది. తాను మాత్రం ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని.. అలా అని ఎవరైనా నిరూపించాలని ఆమె సవాల్ చేసింది కూడా. కట్ చేస్తే.. గతంలో ఒక సందర్భంలో తాను డ్రగ్స్‌కు బానిస అయ్యానని, తర్వాత దాన్నుంచి బయటపడ్డానని స్వయంగా కంగనానే చెప్పిన వీడియో బయటికి రావడంతో ఆమె గాలి తీసేసినట్లయింది. ఇక అక్కడి నుంచి డ్రగ్స్ గురించి మాట్లాడట్లేదామె.

తాజాగా కంగనా మరోసారి డబుల్ స్టాండర్డ్ కామెంట్‌తో నెటిజన్లకు దొరికిపోయింది. కొత్తగా హిందుత్వ ముద్ర వేయించుకునే ప్రయత్నంలో ఉన్న కంగనా.. ‘పీకే’ సినిమాలో హిందూ దేవుడిని కించపరిచేలా ఉన్న ఒక సన్నివేశం తాలూకు ఫొటో పెట్టి ఇలా మరో మతానికి చెందిన దేవుడిని సినిమాలో చూపిస్తే ఊరుకుంటారా అని ప్రశ్నించింది. ఆమె ప్రశ్న బాగానే ఉంది కానీ.. ఇప్పుడిలా అంటున్న కంగనా, ఒకప్పుడు ‘పీకే’ సినిమా సక్సెస్ మీట్లో పాల్గొంది. కానీ అప్పుడు ఆమె ఆ సినిమాలోని సన్నివేశాల గురించి ఎందుకు అభ్యంతర పెట్టలేదు, ఎలా ఆ చిత్ర సక్సెస్ మీట్లో పాల్గొంది అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీనికి కంగనా దగ్గర సమాధానం లేకపోయింది.