26 తాళిబొట్లు తెంచిన వ్యక్తి జగన్: చంద్రబాబు

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మరణాలు పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. గడిచిన వారం రోజుల్లో కల్తీ సారా తాగి దాదాపు 26 మంది మరణించడం రాజకీయ ప్రకంపనలు రేపింది. ఈ నేపథ్యంలోనే జంగారెడ్డిగూడెంలో టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు పర్యటించారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మృతుల కుటుంబాలకు పరామర్శించిన చంద్రబాబు.. జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆడబిడ్డల తాళిబొట్లు తెంచేసిన వ్యక్తి జగన్ అని చంద్రబాబు షాకింగ్ కామెంట్లు చేశారు. తనను కలవవద్దంటూ బాధిత కుటుంబాలలోని మహిళలను వైసీపీ నేతలు బెదిరించడంపై చంద్రబాబు మండిపడ్డారు. చంద్రబాబును కలిస్తే పెన్షన్ కూడా ఆపేస్తామని బెదిరించారని అక్కడి మహిళలు వాపోవడంతో చంద్రబాబు నిప్పులు చెరిగారు. నాడు గొడ్డలి పోటును గుండెపోటు అని చెప్పిన జగన్…ఈ రోజు కల్తీ సారా మరణాలను సహజ మరణాలంటున్నారని ఆరోపించారు. సిగ్గులేకుండా ఆ మరణాలను దాచిపెడుతున్నారని విమర్శించారు.

తాను చేసేవి ప్రజా రాజకీయాలని, వివేకా హత్యలో తనపై నిందలు వేశారని చంద్రబాబు అన్నారు. ఎన్నికల ముందు చెప్పిన మద్యపాన నిషేధం ఏమయ్యిందని నిలదీశారు. సొంత మద్యం బ్రాండ్లు తేవడమే మద్యపాన నిషేధమా? అంటూ ఫైర్ అయ్యారు. మద్యం రేట్లు పెంచడం వల్ల తాగేవాళ్లు తగ్గలేదని, కల్తీ, నాసిరకం, నాటు సారా తాగి చనిపోయే వాళ్ల సంఖ్య పెరిగిందని అన్నారు. కమిషన్ల కోసమే వైన్ షాప్స్ లో ఆన్లైన్ చెల్లింపులు పెట్టడం లేదని ఆరోపించారు.

టీడీపీ లేకుంటే చనిపోయిన కుటుంబాలవైపు ప్రభుత్వం చూసేది కాదని, వైసీపీ నేతల అవినీతి అనకొండ అంతటి అవినీతి అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. మృతులకు ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున పార్టీ నుంచి ఆర్థికసాయం అందించనుందని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వివాఖ ఎల్జీ పాలిమర్స్ తప్పు వల్ల జనం చనిపోతే ప్రభుత్వం పరిహారం ఇచ్చిందని, ఇవి కూడా ప్రభుత్వం చేసిన హత్యలేనని, కాబట్టి పరిహారం ఎందుకు ఇవ్వదని ప్రశ్నించారు.  టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల సాయం అందిస్తామన్నారు.