బీజేపీ నేత‌కు కేసీఆర్ రాజ్య‌స‌భ సీటు!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. కేంద్రంలోని బీజేపీ  స‌ర్కారుపై స‌మ‌రశంఖం పూరించారు. బీజేపీ ప్ర‌భుత్వాన్ని, ప్ర‌ధాని మోడీని తీవ్రంగా విమ‌ర్శిస్తున్న ఆయ‌న జాతీయ రాజ‌కీయాలపై పూర్తి దృష్టి సారించారు. దేశంలోని  బీజేపీ  వ్య‌తిరేక శ‌క్తుల‌ను ఒక్క‌టి చేసేందుకు దేశ‌వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తున్నారు. ఇప్ప‌టికే కొన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, కీల‌క నేత‌ల‌ను ఆయ‌న క‌లిశారు. బీజేపీ అంటేనే చాలు అగ్గి మీద గుగ్గిలంలా మండిప‌డుతున్న ఆయ‌న‌.. ఓ బీజేపీ నేత‌కు రాజ్య‌స‌భ సీటు ఇస్తారనే ప్ర‌చారం ఆస‌క్తి రేపుతోంది.

బీజేపీపై పోరాటానికి వివిధ పార్టీల మ‌ద్ద‌తు కోసం కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. ఆయ‌న తాజాగా బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి, భార‌తీయ కిసాన్ యూనియ‌న్ నేత రాకేష్ టికాయిత్‌తో ఢిల్లీలో భేటీ కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. బీజేపీపై పోరు బావుటా ఎగ‌రేసిన కేసీఆర్‌తో బీజేపీ రాజ్య‌స‌భ ఎంపీ సుబ్ర‌హ్మ‌ణ్యం స‌మావేశ‌మ‌వ్వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే గ‌త కొద్దికాలంగా ప్ర‌ధాని మోడీ, కేంద్ర ప్ర‌భుత్వ విధానాల‌పై సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి త‌ర‌చూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న కేసీఆర్‌తో భేటీ కావ‌డం ఆస్త‌కి రేపుతోంది.

త‌మిళ‌నాడుకు చెందిన సుబ్ర‌హ్మ‌ణ్యం 2016లో రాజ్య‌స‌భ‌కు నామినేట్ అయ్యారు. ఆయ‌న ప‌ద‌వీ కాలం ఈ ఏడాది ఏప్రిల్‌లో ముగుస్తుంది. ఈ స‌మ‌యంలో కేసీఆర్‌తో ఆయ‌న భేటీ కావ‌డంపై ర‌క‌ర‌కాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జాతీయ రాజ‌కీయాల‌పై క‌న్నేసిన కేసీఆర్‌.. అక్క‌డ త‌న‌కు న‌మ్మ‌కంగా ఉండేవాళ్ల‌ను రాజ్య‌స‌భ‌కు పంపుతారనే ప్ర‌చారం సాగుతోంది. ఆ నేప‌థ్యంలోనే సుబ్ర‌హ్మ‌ణ్య స్వామిని కూడా రాజ్య‌స‌భ‌కు పంపుతారనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. స‌మ‌కాలీన రాజ‌కీయాల‌పై కేసీఆర్‌తో చ‌ర్చించాన‌ని, త‌న‌కు అన్ని పార్టీల్లోనూ స్నేహితులున్నార‌ని సుబ్ర‌హ్మ‌ణ్యం అంటున్నారు. కానీ ఈ భేటీ వెన‌క ఏదో మ‌త‌ల‌బు ఉంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

ఈ ఏడాది జూన్‌తో తెలంగాణ‌కు చెందిన ముగ్గురు రాజ్య‌స‌భ సభ్యుల స్థానం ఖాళీ అవుతుంది. వాటి అభ్య‌ర్థుల విష‌యంపై కేసీఆర్ ఇంకా క‌స‌ర‌త్తులు మొద‌లెట్ట‌లేదు. కానీ వాటిలో ఒక స్థానంలో న‌టుడు ప్ర‌కాష్‌రాజ్‌ను రాజ్య‌స‌భ‌కు పంపిస్తార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. జాతీయ రాజ‌కీయాల్లో త‌న త‌ర‌పున ప్ర‌కాష్‌ను ఉప‌యోగించుకోవాల‌ని కేసీఆర్ చూస్తున్నార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్, ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్‌ను కేసీఆర్ క‌లిసిన స‌మ‌యంలో ప్ర‌కాష్ రాజ్ క‌నిపించిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు ఇప్పుడు సుబ్ర‌హ్మ‌ణ్యం కూడా రాజ్య‌స‌భ రేసులో ఉన్నార‌నే ప్ర‌చారం ఊపందుకుంది.