కేసీఆర్ కౌగిలించుకున్నా.. కోమ‌టిరెడ్డి త‌గ్గ‌డం లేదు

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి ఎత్తు వేయాలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బాగా తెలుస‌ని చెబుతుంటారు. ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఆయ‌న త‌న వ్య‌వ‌హార శైలి మార్చుకుంటారు. అస‌రాల‌కు అనుగుణంగా ప్ర‌త్య‌ర్థి పార్టీల‌పై కోపాన్ని, ప్రేమ‌ను ఒల‌క‌బోస్తుంటారు. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వంపై తీవ్ర ఆగ్ర‌హాన్ని కేసీఆర్ ప్ర‌ద‌ర్శిస్తున్నారు. మోడీని దేశం నుంచి త‌రిమికొట్టాల‌ని పిలుపునిచ్చారు. మ‌రోవైపు కాంగ్రెస్‌పై ప్రేమ చూపిస్తున్నారు. రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వ‌శ‌ర్మ చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌పై కేసీఆర్ తీవ్రంగా మండిప‌డ్డారు.

ఇక మ‌రోవైపు జిల్లాల ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా న‌ల్గొండ వెళ్లిన ఆయ‌న‌.. అక్క‌డ కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డిని కౌగిలించుకుని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.  టీఆర్ఎస్‌పై విమ‌ర్శ‌లు చేసే ఎంపీని హత్తుకున్న ఆయ‌న వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించుకునే ప్ర‌య‌త్నం చేశార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ర‌క‌ర‌కాల ఊహాగానాలు వినిపించాయి. కానీ కోమ‌టిరెడ్డి మాత్రం కేసీఆర్ విష‌యంలో టీఆర్ఎస్ విష‌యంలో త‌గ్గేదేలే అని మ‌రోసారి నిరూపించారు. సింగ‌రేణి బొగ్గు గ‌ని టెండ‌ర్ల‌లో భారీ కుంభ‌కోణం జ‌రుగుతుంద‌ని, సీఎం కేసీఆర్ బంధువుకు దాన్ని కేటాయించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని కోమ‌టిరెడ్డి ఆరోపించారు.

కోల్ ఇండియా నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా సింగ‌రేణి ప‌రిధిలో ఇటీవ‌ల నిర్వ‌హించిన బొగ్గు గ‌ని టెండ‌ర్‌ను ర‌ద్దు చేయాల‌ని భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంట‌క్‌రెడ్డి డిమాండ్ చేశారు. అందులో సుమారు రూ. 20 వేల కోట్ల వ‌ర‌కు కుంభ‌కోణం ఉంద‌ని ఆయ‌న ఆరోపించారు. కేసీఆర్ బంధువుకు దాన్ని క‌ట్ట‌బెట్టేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని పేర్కొన్నారు.

దేశంలో ఎక్క‌డా లేని విధంగా త‌క్కువ మంది పాల్గొనేలా టెండ‌ర్ ప్ర‌క్రియ నిర్వ‌హించార‌ని ఎవ‌రి ఒత్తిడి మేర‌కు ఇలా చేశారో సింగ‌రేణి సీఎండీ చెప్పాల‌ని కోమ‌టిరెడ్డి డిమాండ్ చేశారు. మ‌రో పది రోజుల్లో తెరిచే ఈ టెండ‌ర్ సీఎం బంధువ‌కు ద‌క్కేలా అన్ని ఏర్పాట్లు చేశార‌ని ఆరోపించారు. దీనిపై ప్ర‌ధానికి లేఖ రాసిన‌ట్లు వెల్ల‌డించారు. రూ.50 కోట్ల విలువైన ఈ టెండ‌ర్ విష‌య‌మై సుప్రీం కోర్టులో న్యాయ పోరాటం చేస్తామ‌న్నారు. ఈ నేప‌థ్యంలో కోమ‌టిరెడ్డి చేసిన తాజా వ్యాఖ్య‌లు చూస్తుంటే.. కేసీఆర్‌పై పోరాటంలో త‌గ్గేదేలే అన్న‌ట్లు ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.