ఉపాధ్యాయుల‌కు ప్ర‌మోష‌న్ల ఎర‌

చ‌లో విజ‌య‌వాడ విజ‌యంతం కావ‌డంతో ఉద్యోగుల ఆందోళ‌న అధికార వైసీపీకి పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. ఈ కార్య‌క్ర‌మం స‌క్సెస్‌తో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు స‌మ్మె విష‌యంలోనూ ఇదే వేగంతో సాగేలా క‌నిపిస్తున్నారు. ఈ నెల ఆరు అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్లాల‌ని పీఆర్సీ సాధ‌న స‌మితి నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. ఆ స‌మ్మె కానీ ఆరంభ‌మైందంటే సీఎం జ‌గ‌న్‌కు ప్ర‌భుత్వానికి ఇబ్బందులు పెరిగే అవ‌కాశం ఉంది. అందుకే స‌మ్మెకు వెళ్ల‌కుండా అడ్డుకునేందుకు ప్ర‌భుత్వం అవ‌స‌ర‌మైన అన్ని ర‌కాల ప్ర‌యత్నాల‌కు సిద్ధ‌మైంది.

అందులో భాగంగానే ఉపాధ్యాయుల‌ను కూల్ చేసేందుకు రంగం సిద్ధం చేసిన‌ట్లు స‌మాచారం. చ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మం ఇంత‌గా స‌క్సెస్ అయిందంటే ముఖ్య కార‌ణం ఉపాధ్యాయులు. వాళ్లు భారీ సంఖ్య‌లో త‌ర‌లి రావ‌డంతో విజ‌య‌వాడ ద‌ద్ద‌రిల్లింది.

ఈ నేప‌థ్యంలోనే ఉద్య‌మంలో ప్ర‌ధాన భూమిక పోషిస్తున్న ఉపాధ్యాయుల‌ను చ‌ల్ల‌బ‌రిచేందుకు జ‌గ‌న్ స‌ర్కార్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. అందులో భాగంగా ఎస్జీటీల‌కు ప్ర‌మోష‌న్ ఆశ చూపుతోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ 19 పాఠ‌శాల‌ల మ్యాపింగ్ పూర్త‌యింద‌ని 22 వేల మందికి పైగా టీచ‌ర్ల‌కు ఎస్జీటీల నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా ప్ర‌మోష‌న్ క‌ల్పించ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

మ‌రో 17 వేల పాఠ‌శాల‌ల్లో విద్యార్థుల సంఖ్య‌కు అనుగుణంగా టీచ‌ర్ల నియామ‌కాలు రేష‌న‌లైజేష‌న్ ద్వారా మ‌రో 8 వేల మందికి ప‌దోన్న‌తులు ల‌భిస్తాయ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. జూన్ నాటికి మొత్తం 30 వేల మంది ఉపాధ్యాయుల‌కు స్కూల్ అసిస్టెంట్లుగా ప‌దోన్న‌తులను జ‌గ‌న్ స‌ర్కారు క‌ట్ట‌బెట్ట‌నున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. దీంతో ఉపాధ్యాయుల‌ను ఉద్య‌మం నుంచి వెన‌క్కి లాగేందుకు ప్ర‌మోష‌న్ల పేరుతో ప్ర‌భుత్వం ఎర వేస్తుంద‌నే అభిప్రాయాలు వ్య‌క‌మ‌వుతున్నాయి. మ‌రి ప్ర‌భుత్వ ఆశ‌కు లొంగిపోయి ఉపాధ్యాయులు ఉద్య‌మం నుంచి బ‌య‌ట‌కు వ‌స్తారా? అన్న‌ది అనుమానమే. ఉద్యోగుల డిమాండ్ల‌ను వ‌దిలేసి ఇత‌రేత‌ర మార్గాల్లో సమ్మెను అడ్డుకోవ‌డానికి ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నించ‌డం ఫ‌లితాన్నిస్తుందా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.