మహేష్ సినిమా.. క్రేజీ అప్డేట్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమాకు రంగం సిద్ధమవుతోంది. అతను ఆల్రెడీ ‘సర్కారు వారి పాట’లో నటిస్తుండగా.. దాని షూటింగ్ చివరి దశలో ఉంది. దీని తర్వాత మహేష్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. మధ్యలో ఈ సినిమా ఆగిపోయిందంటూ రూమర్లు వినిపించాయి కానీ.. ఆ వార్తల్లో నిజం లేదని తేలింది. ఇటీవలే దుబాయ్‌లో మహేష్‌ను త్రివిక్రమ్ కలిసి ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ పనుల గురించి చర్చించినప్పటి ఫొటో కూడా బయటికి రావడం తెలిసిందే.

‘సర్కారు వారి పాట’ షెడ్యూల్ ప్రకారం పూర్తయి ఉంటే వచ్చే నెలలోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లి ఉండాలి. కానీ మహేష్ కరోనా బారిన పడటం.. ‘సర్కారు వారి పాట’ షూటింగ్ కూడా వాయిదా పడటంతో ఈ చిత్రం కాస్త ఆలస్యంగా మొదలయ్యేలా కనిపిస్తోంది. ఐతే ఈ లోపు పక్కాగా స్క్రిప్టు రెడీ చేసుకుని కాస్ట్ అండ్ క్రూ సంగతి తేల్చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేయాలని చిత్ర బృందం చూస్తోంది.

ఈ క్రమంలోనే మహేష్-త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి కొన్ని క్రేజీ అప్డేట్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ చిత్రంలో మహేష్ బాబు సోదరిగా సాయిపల్లవి నటించబోతోందన్నది అందులో ఒక అప్డేట్. తెలుగులో ఇప్పటిదాకా సాయిపల్లవి టాప్ స్టార్స్‌తో సినిమాలు చేయలేదు. అలాగే ఇప్పటిదాకా కథానాయిక పాత్రల్లో తప్ప వేరే క్యారెక్టర్లలో కనిపించలేదు. అలాంటిది ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో ఆయనకు సోదరిగా చేయబోతోందంటే అందరికీ ఎగ్జైటింగ్‌గా అనిపించే విషయమే.

త్రివిక్రమ్ సినిమాల్లో స్పెషల్ లేడీ క్యారెక్టర్లు ఉంటాయి. ఇది కూడా అలాంటి పాత్రే అనుకోవచ్చు. మరోవైపు ఈ చిత్రంలో ఒక కీలకమైన ప్రతినాయక పాత్రలో సునీల్ శెట్టి నటిస్తున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. ఇది మాత్రం మహేష్ అభిమానులను కొంత కలవరపెట్టే విషయమే. సునీల్ శెట్టి సౌత్ సినిమాల్లో స్పెషల్ క్యారెక్టర్లు చేసిన ఏ సినిమా సరిగా ఆడిన దాఖలాలు లేవు. చివరగా తెలుగులో చేసిన ‘మోసగాళ్లు’ పెద్ద డిజాస్టర్ అయింది. అలాగే మలయాళంలో అతను నటించిన ‘మరక్కార్’ సైతం సరిగా ఆడలేదు. మరి ఈ నెగెటివ్ సెంటిమెంటును పట్టించుకోకుండా త్రివిక్రమ్-మహేష్ ముందుకెళ్లిపోతారేమో చూడాలి.