టికెట్ల రేట్లపై జగన్ కామెంట్

ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల ధరల వ్యవహారం కొన్ని నెలల నుంచి ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో టికెట్ల రేట్లపై నియంత్రణ తేవడం.. ఈ కారణంగా చిన్న సెంటర్లలో థియేటర్ల మనుగడే ప్రశ్నార్థకంగా మారడం తెలిసిందే. ముందుగా పవన్ కళ్యాణ్ సినిమా ‘వకీల్ సాబ్’ను టార్గెట్ చేస్తూ ఈ నియంత్రణ తీసుకురాగా.. ఆ తర్వాత మొత్తం అన్ని సినిమాలకూ అది తీవ్ర ఇబ్బందికరంగా మారింది. ఈ సమస్య అంతకంతకూ జఠిలంగా మారి.. ఎంతకీ పరిష్కారం రావట్లేదు. ఈ విషయంలో ప్రభుత్వం తీరుపై బాగా విమర్శలు వచ్చాయి.

ఐతే టికెట్ల ధరల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమేయం పెద్దగా లేదని, ఆయనకు ఈ విషయమై సరైన సమాచారం లేదని.. మంత్రులు, అధికారులే ఆయన్ని తప్పుదోవ పట్టించారని ఓ వర్గం మీడియాలో ప్రచారం సాగింది. కానీ జగన్ ప్రమేయం లేకుండా ఏమీ ఇదంతా జరగలేదని.. ఈ విషయంలో ఆయన పూర్తి స్పష్టతతోనే ఉన్నారని తేలిపోయింది.

ఇన్నాళ్లు టికెట్ల ధరల వ్యవహారంపై మంత్రులే మాట్లాడుతూ వచ్చారు. ప్రభుత్వ నిర్ణయాల్ని సమర్థిస్తూ వచ్చారు. ప్రజల మంచి కోసమే ఇదంతా చేస్తున్నామని చెబుతూ వచ్చారు. ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి కూడా ఇదే తరహాలో మాట్లాడారు. ‘‘పేదవాడికి అందుబాటు రేటుకు వినోదాన్ని అందించాలని సినిమా టికెట్ల ధరలను కూడా నిర్ణయిస్తే.. ఆ నిర్ణయం మీద కూడా రకరకాలుగా ఈ రోజు మాట్లాడుతున్నారు. ఇటువంటి వాళ్లు పేదల గురించి ఆలోచించేవాళ్లేనా? ఇటువంటి వారు పేదల గురించి పట్టించుకునేవాళ్లేనా? ఇలాంటి వాళ్లు పేదవారికి శత్రువులు కాదా అని అందరూ ఆలోచించాలని కోరుతున్నా.

పేదలకు మంచి చేస్తుంటే అడ్డుపడకూడదనే జ్ఞానం ఇలాంటి వాళ్లకు దేవుడు ఇవ్వాలి’’ అంటూ కొత్త సంవత్సరం సందర్భంగా చేసిన ప్రసంగంలో జగన్ వ్యాఖ్యానించారు. ఐతే టికెట్ల ధరలు తగ్గించి పేదలకు మేలు చేయాలనుకోవడం బాగానే ఉంది కానీ.. అలాగే నిత్యావసరాలు ధరలు కూడా తగ్గించాలని జనాలు ముందు నుంచి చేస్తున్న డిమాండ్లే ఇప్పుడు కూడా వినిపిస్తున్నాయి. పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి భారం కాకుండా సీఎంకు చెందిన భారతి సిమెంట్ ధరల్ని తగ్గించాంటూ నెటిజన్లు ఎప్పట్లాగే కౌంటర్లు వేస్తున్నారు.