ఓమిక్రాన్ దెబ్బ.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కట్!

మ‌రో ఆరురోజుల్లో న్యూ ఇయ‌ర్ 2022 వేడుక‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం షాకిచ్చింది. న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌ను అట్ట‌హాసంగా చేసుకునేందుకుఎలాంటి అనుమ‌తులు ఇవ్వ‌డం లేద‌ని స్ప‌ష్టం చేసింది. అదేవిధంగా ర్యాలీలు, ప్ల‌బ్బులు, క్ల‌బ్బుల‌ను కూడా ఆ రోజు త‌ర్వాత రెండు రోజుల పాటు మూసేయ‌నున్న‌ట్టు తెలిపింది. ప్ర‌జ‌లు ఎవ‌రూ బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ఎలాంటి వేడుక‌లు నిర్వ‌హించుకోరాద‌ని స్ప‌ష్టం చేసింది.

దీనికి కార‌ణం.. ప్ర‌పంచాన్ని ఒణికిస్తున్న ఒమిక్రాన్‌! ప్ర‌స్తుతం తెలంగాణ‌లోనూ ఈ వేరియెంట్ క‌ల‌క‌లం సృష్టిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం తాజాగా ఆదేశాలు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి.
ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో తెలంగాణ‌ ప్రభుత్వం కొవిడ్ నియంత్రణా చర్యలకు ఉపక్రమించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ సూచనలను దృష్టిలో ఉంచుకొని విపత్తు నిర్వహణా చట్టం కింద ఆంక్షలు అమలు చేయనుంది.

వచ్చే నెల(జ‌న‌వ‌రి-2022) రెండో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలు నిషేధించారు. కొన్ని నియంత్రణా చర్యలతో జనసమూహం గుమిగూడే కార్యక్రమాలకు అనుమతి ఇవ్వనున్నారు. ఆయా కార్యక్రమాలు జరిగే వేదిక వద్ద భౌతికదూరం తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలి. వేదికల ప్రవేశద్వారాల థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేసి వ్యక్తుల శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించాల్సి ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించే విషయమై గతంలో జారీ చేసిన ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

ఆ ఉత్తర్వు ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారికి వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు తాజా ఉత్తర్వులను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే.. గ‌త ఏడాది కూడా ఇదే ఆదేశాల‌తో నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల‌కు దూర‌మైన ప్ర‌జ‌లు.. ఇప్పుడు కూడా దూరం కావ‌డంపై స‌ర్వ‌త్రా నిరాస ఎదురవుతుండ‌డం గ‌మ‌నార్హం.