మ‌నోళ్ల‌ను కాద‌ని ఆంధ్రోళ్లు కాంట్రాక్ట‌ర్లా? రేవంత్ ధ్వ‌జం

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను త‌న వ్యాఖ్య‌ల‌తో టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ రేవంత్‌రెడ్డి.. తాజాగా మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. సీఎం కేసీఆర్కు సచివాలయం మీదున్న శ్రద్ధ.. అమరవీరుల స్థూపంపై లేదని విమర్శించారు. స్తూపం నిర్మాణ పనులపై సమీక్షించే తీరిక కేసీఆర్కు లేదని ఎద్దేవా చేశారు. హైదరాబాద్లో అమరవీరుల స్మారకం నిర్మాణ పనులను పరిశీలించిన రేవంత్.. కాంట్రాక్ట‌ర్‌ని పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ అమరవీరుల స్తూపం ప్రపంచం ఆశ్చర్యపోయేలా నిర్మిస్తామని చెప్పి.. ఏడేళ్లు గడిచినా సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. అమరుల కుటుంబాలకు ఉద్యోగం, ఆర్థిక సాయం, భూమి ఇస్తామని ఇప్పటికీ ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయం ఎదుట నిర్మాణంలో ఉన్న అమరవీరుల స్మారక భవనాన్ని రేవంత్ రెడ్డి పరిశీలించారు. భవన నిర్మాణానికి సంబంధించిన వివరాలను నిర్మాణదారుడి సూపర్‌వైజర్‌ను అడిగి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్‌కు సచివాలయం మీదున్న శ్రద్ధ.. అమరవీరుల స్తూపంపై లేదని రేవంత్‌ విమర్శించారు.

ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన వందలాది విద్యార్థుల స్మరణకు ఈ స్మారక స్తూపం చిహ్నం. స్మారక భవనం నిర్మాణం చేపట్టి ఇప్పటికి ఏడేళ్లు దాటింది. అయినా పూర్తి కాలేదు. కేసీఆర్‌కు సచివాలయం మీదున్న శ్రద్ధ అమరవీరుల స్తూపంపై లేదు. అమరవీరుల స్మారకం నిర్మాణంపై సమీక్షించే తీరిక సీఎంకు లేదు. స్తూపాన్ని నిర్మిస్తున్నవారు కూడా తెలంగాణ వాసులు కాదు. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా గుత్తేదారుకు స్మారక స్తూపం నిర్మాణ కాంట్రాక్టు ఇచ్చారు. నిర్మాణానికి తెలంగాణ బిడ్డలు ఎవ్వరూ సరిపోరా.? అని రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.

అమరవీరుల స్తూప నిర్మాణం కోసం 2017 లో కేసీఆర్ రూ. 80కోట్లు కేటాయించి.. 2018 లో టెండర్ పిలిచారని రేవంత్ పేర్కొన్నారు. టీ హబ్‌ నిర్మాణంలో కోట్ల రూపాయలు కొల్లగొట్టిందని కాగ్ చెప్పిన సంస్థకే స్తూపం నిర్మాణ పనులను ప్రభుత్వం అప్పగించిందని ఆక్షేపించారు. ఆంధ్రా కాంట్రాక్టర్‌కు పనులు ఇచ్చినందుకు కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సమాజం నుంచి కేసీఆర్‌ కుటుంబాన్ని వెలివేయాలని రేవంత్ రెడ్డి అన్నారు.