ఏపీలో బీజేపీ అధికారం.. అదెలా రాజుగారు?

ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు.. 2019 ఎన్నిక‌ల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేక‌పోయింది. మెజారిటీ చోట్ల ఆ పార్టీకి క్యాడ‌ర్ కూడా స‌రిగ్గా లేదు. కానీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో మాత్రం అధికారం త‌మ‌దే అని ఆ పార్టీ నాయ‌కులు అంటున్నారు.

ఇంత‌కీ ఆ పార్టీ ఏది అంటే.. అది బీజేపీ. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేది త‌మ పార్టీనే అని కొన్ని రోజులుగా బీజేపీ రాష్ట్ర నాయ‌కులు మాట్లాడుతున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు అవే వ్యాఖ్య‌లు చేయ‌గా.. తాజాగా మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కూడా అదే అంటున్నారు.

వైసీపీ నేత‌లు గుర్తుపెట్టుకోండి మీ అధికారం మ‌రో రెండేళ్లు మాత్ర‌మే ఆ త‌ర్వాత వ‌చ్చేది బీజేపీ ప్ర‌భుత్వ‌మే అని విలేక‌ర్ల స‌మావేశం పెట్టి మ‌రీ విష్ణు చెప్పారు. ఆయ‌న మాట‌ల వెన‌క ఆంత‌ర్యం ఏమిటో? అర్థం కాన‌ప్ప‌టికీ ఆ వ్యాఖ్య‌ల‌ను జ‌నాలు ఎప్ప‌టిలాగే సిల్లీగా తీసుకున్నారని విశ్లేష‌కులు అంటున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన బ‌ద్వేలు ఉప ఎన్నిక‌లో బీజేపీకి 21 వేల దాకా ఓట్లు వ‌చ్చాయి.

2019 ఎన్నిక‌ల‌తో పోలిస్తే (అప్పుడు 750 వ‌ర‌కూ వ‌చ్చాయి) ఇప్పుడు 30 రెట్ల వ‌ర‌కూ అధికంగా ఓట్లు వ‌చ్చాయి. అయితే ఈ ఫ‌లితాల‌ను చూసే బీజేపీ నాయ‌కులు 2024 ఎన్నిక‌ల్లో బీజేపీదే విజ‌య‌మ‌ని అంటున్నార‌ని టాక్‌.

కానీ ఈ ఉప ఎన్నిక‌లో బీజేపీ ఏమైనా గెలిచిందా? అంటే లేదు. రాజ‌కీయ విలువ‌ల కోసం జ‌న‌సేన‌. సంప్ర‌దాయం పేరుతో టీడీపీ పోటీ నుంచి త‌ప్పుకోవ‌డంతో బీజేపీకి ఆ మాత్ర‌మైనా ఓట్లు వ‌చ్చాయ‌నేది తెలిసిన విష‌య‌మే. ఈ నేప‌థ్యంలో విష్ణు వ్యాఖ్య‌లు విన్న ప్ర‌జ‌లు మ‌రి ఎలా అధికారంలోకి వ‌స్తారో కూడా కాస్త చెప్పండి రాజుగారూ అని అడుగుతున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు అస‌లు బీజేపీకి స‌రైన అభ్య‌ర్థులు ఉన్నారా అంటే స‌మాధానం దొర‌క‌డం క‌ష్ట‌మే. అలాంటిది జ‌గ‌న్ ధాటిని త‌ట్టుకుని ఆ పార్టీ నిల‌బ‌డుతుందంటే ఎవ‌రు న‌మ్ముతారు.

మ‌రోవైపు విశాఖ స్టీలు ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ కోసం కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు వేగంగా పావులు క‌దుపుతోంది. దీంతో పాటు దేశ‌వ్యాప్తంగా బీజేపీపై వ్య‌తిరేక‌త పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో ఆ పార్టీకి ఓట్లు ప‌డ‌తాయా? అన్న‌ది సందేహ‌మే.

మ‌రోవైపు విష్ణుకుమార్ రాజు గ్రేట‌ర్ విశాఖ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ 31 వార్డు ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థికి త‌మ పార్టీ మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఓ వైపు టీడీపీతో అస‌లు పొత్తే ఉండ‌ద‌ని రాష్ట్ర, కేంద్ర బీజేపీ నేత‌లు ప‌దేప‌దే చెప్తున్న‌ప్ప‌టికీ విష్ణు ఈ ప్ర‌క‌ట‌న చేసి సొంత పార్టీకే షాకిచ్చార‌ని నిపుణులు చెబుతున్నారు.