సిద్ధూ ష‌ర‌తులు

Navjot Singh Sidhu

పంజాబ్‌లో అధికార పార్టీ కాంగ్రెస్‌కు కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగిన‌ట్లేన‌ని చెప్పాలి. వ‌చ్చే ఏడాది ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఇటీవ‌ల పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలు ఆందోళ‌న రేకెత్తించాయి. అమ‌రీంద‌ర్ సింగ్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌పుడు పీసీసీ అధ్య‌క్షుడు న‌వ్‌జ్యోత్ సింగ్ సిద్ధూతో మొద‌లైన విభేదాలు చిలికి చిలికి గాలివాన‌లా మారిన సంగ‌తి తెలిసిందే. చివ‌ర‌కు అమ‌రీంద‌ర్ సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయాల్సి వ‌చ్చింది. చ‌ర‌ణ్‌జీత్ సింగ్ చ‌న్నీని అధిష్ఠానం ఆ కుర్చీలో కూర్చోబెట్టింది. దీంతో స‌మ‌స్య స‌ద్దుమ‌ణిగింది అనుకుంటున్న స‌మ‌యంలో పీసీసీ ప‌ద‌వికి సిద్ధూ రాజీనామా చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. చ‌ర‌ణ్‌జీత్ సార‌థ్యంలోని కొత్త కేబినేట్ శాఖ‌ల కేటాయింపుపై అసంతృప్తి ఇత‌ర కార‌ణాల‌తో సిద్దూ రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే.

సిద్ధూ రాజీనామాను ఆమోదించ‌ని అధిష్టానం ఆయ‌న‌తో మాట్లాడి స‌ర్దిచెప్పింది. దీంతో తాజాగా తాను రాజీనామాను వెన‌క్కి తీసుకుంటాన‌ని సిద్ధూ ప్ర‌క‌టించారు. పీసీసీ అధ్య‌క్షుడిగా కొన‌సాగుతాన‌ని స్ప‌ష్టం చేశారు. కానీ ఇక్క‌డో ఓ మెళిక పెట్టారు. కొన్ని ష‌ర‌తులు విధించిన ఆయ‌న త‌న పంతం నెగ్గించుకునే దిశ‌గా సాగుతున్నార‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొత్త అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్‌, డీజీపీ నియామ‌కం త‌ర్వాతే తాను తిరిగి పీసీసీ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు తీసుకుంటాన‌ని సిద్ధూ ప‌క్కాగా తేల్చిచెప్పారు. తాను ఏం చేసినా పంజాబీల ప్ర‌యోజ‌నం కోస‌మేన‌ని సీఎం చ‌ర‌ణ్‌జీత్‌తో త‌న‌కెలాంటి విభేదాలు లేవ‌ని ఆయ‌న మ‌రోసారి ఉద్ఘాటించారు. ప‌నిలో ప‌నిగా మాజీ ముఖ్య‌మంత్రి అమ‌రీంద‌ర్‌పైనా విమ‌ర్శ‌లు చేశారు. గ‌తంలో సీఎంగా ఉన్న అమ‌రీంద‌ర్ అధికారుల‌ను త‌న చేతుల్లో పెట్టుకుని ప‌నులు చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌ని సిద్దూ విమ‌ర్శించారు.

పీసీసీ అధ్య‌క్షుడిగా కొన‌సాగుతాన‌ని ప్ర‌క‌టించిన సిద్ధూ అందుకు ష‌ర‌త‌లు పెట్ట‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం పంజాబ్ అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్‌గా ఉన్న ఏపీఎస్ డియోల్ నియామ‌కాన్ని సిద్ధూ తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. 2015లో అకాలీద‌ళ్ ప్ర‌భుత్వ హ‌యాంలో నిర‌స‌న‌కారుల‌పై కాల్పులు, మ‌త‌ప‌ర‌మైన ఘ‌ట‌న‌ల‌కు సంబంధించిన కేసుల్లో నిందితులైన మాజీ డీపీపీ సుమేధ్ సైనీ త‌ర‌పున వాదించిన డియోల్‌ను ఇప్పుడు ఏపీగా నియ‌మించడాన్ని సిద్ధూ వ్య‌తిరేకిస్తున్నారు. అంతే కాకుండా డీజీపీగా ఉన్న స‌హోతాను కూడా త‌ప్పించాల‌ని సిద్ధూ డిమాండ్ చేస్తున్నారు. అయితే సిద్దూ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఏజీ ప‌ద‌వికి డియోల్ రాజీనామా లేఖ‌ను సీఎంకు పంపిన‌ట్లు తెలిసింది. దాన్ని సీఎం చ‌రణ్‌జీత్ తిర‌స్క‌రించిన‌ట్లు స‌మాచారం.