‘మంగళసూత్ర’ యాడ్ వివాదం…దిగొచ్చిన డిజైనర్

ఈ మధ్య కాలంలో వస్తున్న కొన్ని యాడ్ లలో క్రియేటివిటీ శృతిమించుతోందని విమర్శలు వస్తున్నాయి. కొత్తగా ఏదో ట్రై చేసి తమ బ్రాండ్ ను ప్రమోట్ చేసుకోవాలనుకునే క్రమంలో కొన్ని కంపెనీలు కొందరి మనోభావాలను గాయపరుస్తున్నాయి. తీరా ఆ యాడ్ రిలీజైన తర్వాత వివాదం రేగడంతో సైలెంట్ గా క్షమాపణలు చెప్పి యాడ్ ను తీసేస్తున్నాయి. బహుశా ఇలా కాంట్రవర్సీ యాడ్ లు చేయడంతో ఎక్కువ పబ్లిసిటీ వస్తుందని సదరు కంపెనీలు భావిస్తున్నాయేమోనన్న విమర్శలూ లేకపోలేదు.

గతంలో ప్రముఖ నగల కంపెనీ ‘తనిష్క్‘ రూపొందించిన యాడ్, ఆలియా భట్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఓ ప్రముఖ వస్త్ర సంస్థ రూపొందించిన ‘కన్యాదానం’ కాన్సెప్ట్ యాడ్ , బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్‌ నటించిన సియట్ టైర్ల కంపెనీ రూపొందించిన ‘నో క్రాకర్స్’ యాడ్ లు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఇక తాజాగా బాలీవుడ్ సెలెబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్‌లలో ఒకరైన సబ్యసాచి ముఖర్జీ రూపొందించిన యాడ్ కూడా ఆ కోవలోకే చేరింది.

ఇటీవల సబ్యసాచి రూపొందించిన ఓ ఫొటోషూట్ యాడ్ లో కొందరు మోడల్స్ మంగళ సూత్రం ధరించి కనిపించారు. అయితే, కొంత మంది ఒంటరిగా మంగళ సూత్రం ధరించగా, మరికొంత మంది అసభ్యకర రీతిలో పోజ్ ఇచ్చి మంగళ సూత్రం ధరించారు. దీంతో, ఆ యాడ్ వివాదాస్పదమైంది. ఇక, ఆ మంగళ సూత్ర యాడ్‌పై మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి నరోత్తం మిశ్రా స్పందించారు. ఆ యాడ్‌ను 24గంటల్లోగా తొలగించకపోతే సబ్యసాచిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

అంతేకాదు, యాడ్ తీసేయకుంటే పోలీసు బలగాలను పంపిస్తానని హెచ్చరించారు. దీంతో, సబ్యసాచి ముఖర్జీ దిగివచ్చారు. తాము చేసిన మంగళసూత్ర ప్రచారం సమాజంలోని ఒక వర్గాన్ని కించపరిచేలా ఉందని, అందుకు తాము చాలా చింతిస్తున్నామని వెల్లడించారు. తక్షణమే ఆయాడ్ ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు. గతంలో ఉదంతాలు చూసి కూడా ఈ తరహా యాడ్ లు కావాలని చేస్తారో, కాంట్రవర్సీ కోసం చేస్తారోనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.