డీల్ ఫైనల్.. టాటా చేతికి ఎయిరిండియా.. ఎంతకు కొన్నారంటే?

ఒక సంస్థ చేజారిపోవటం.. దశాబ్దాల తర్వాత మళ్లీ అదే సంస్థ చేజిక్కిటం లాంటివి చాలా అరుదుగా చోటు చేసుకుంటాయి. తాజాగా అలాంటిదే ఎయిరిండియా విషయంలో జరిగింది. దాదాపు ఆరు దశాబ్దాల కిందట ఎయిరిండియా టాటా గ్రూపు చేతుల్లో ఉండేది. స్వాతంత్య్రానికి ముందే ఈ సంస్థ టాటా గ్రూపు నిర్వహిస్తుండేది. స్వాతంత్య్రం తర్వాత యాభై శాతం ప్రభుత్వ వాటా.. అనంతరం మొత్తం వాటాను సొంతం చేసుకున్న ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఎయిరిండియా కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండేది. గడిచిన కొన్నేళ్లుగా ఈ సంస్థ నష్టాల మీద నష్టాల్ని నమోదు చేస్తోంది.

దీంతో.. ఈ సంస్థను వదిలించుకోవాలని మోడీ సర్కారు డిసైడ్ కావటం.. ఆ వెంటనే చకచకా తీసుకున్న నిర్ణయాలతో బిడ్ కు వెళ్లటమే కాదు.. తాజాగా టాటా గ్రూపు చేతుల్లోకి వెళ్లిందన్న అధికారిక ప్రకటన కూడా వెల్లడైంది. అయితే.. ఎంత మొత్తానికి ఎయిరిండియాను టాటా కొనుగోలు చేసిందన్న విషయం మీద క్లారిటీ రావటం లేదు. ఎయిరిండియాను సొంతం చేసుకోవటానికి టాటా గ్రూపుతో పాటు..స్పైస్ జెట్ కూడా బిడ్ వేశాయి. అయితే.. టాటా ఈ బిడ్ ను సొంతం చేసుకుంది.

నిజానికి 2018 మార్చిలో ఎయిరిండియాను అమ్మేందుకు ప్రభుత్వం సిద్ధమైనా.. అప్పుడు దాన్ని కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. తాజా బిడ్ లో మాత్రం టాటా గ్రూపు సొంతం చేసుకుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ బిడ్ రూ.15 నుంచి రూ.20 వేల కోట్ల మేరకు ఉంటుందని.. బిడ్ లో పేర్కొన్న దానికి రూ.3వేల కోట్లు అదనంగా ఇచ్చేందుకు టాటా సిద్ధమైందని చెబుతున్నారు. ప్రత్యర్థి స్పైస్ జెట్ కంటే కూడా రూ.5వేల కోట్లు అదనంగా కోట్ చేసినట్లుగా చెబుతున్నారు. ఎయిరిండియా టాటా గ్రూపు చేతుల్లోకి వెళ్లిందంటూ అధికారిక ప్రకటన వెలువడటంతో 67 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఎయిరిండియా మళ్లీ తన సొంతింటికి చేరుకుందని చెప్పక తప్పదు.

ఎయిరిండియా వేసిన బిడ్ లో 15 శాతం మొత్తాన్ని నగదు రూపంలో ఇప్పుడే చెల్లించాల్సి ఉంటుంది. నిజానికి ఎయిరిండియాను సొంతం చేసుకోవటానికి టాటా గ్రూపు భారీగానే ప్రయత్నాలు చేసిందని చెప్పాలి. ఇందుకోసం ఒక సంస్థను ప్రత్యేకంగా ఏర్పాటు చేయటమే కాదు.. టాటా సన్స్ గ్రూపుల్లోని విస్తార.. ఎయిర్ ఆసియా.. టాటా స్టీల్ నుంచి కొందరు ప్రత్యేక నిపుణుల టీంను ఎయిరిండియాను సొంతం చేసుకోవటానికి రంగంలోకి దించినందన్న మాట వినిపిస్తోంది. 31 దేశాల్లోని 45 నగరాలకు ఎయిరిండియా కనెక్టివిటీ కలిగి ఉంది. మొత్తం 103 గమ్యస్థానాలకు ఎయిరిండియా విమానాల్ని నడుపుతోంది. దేశంలో 58 నగరాలకు విమాన సర్వీసుల్ని నిర్వహిస్తోంది.
తాజా కొనుగోలుతో ఎయిరిండియా తరఫున టాటా గ్రూపునకు ఏమేం దక్కనున్నాయన్న విషయానికి వస్తే..

  • ఎయిరిండియా లోగో
  • డొమెస్టిక్ ఎయిర్‌పోర్టుల్లో 4400 లాండింగ్‌, పార్కింగ్‌ స్లాట్స్‌
  • 1800 అంతర్జాతీయ లాండింగ్ స్లాట్స్
  • 127 విమానాలు
  • 1800 మంది పైలెట్స్
  • 4000 మంది కేబిన్ క్రూ