కోదండం మాష్టారికి కాంగ్రెస్ మద్దతు.. గేమ్ ప్లాన్ ఏమిటి?

తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించటమే కాదు.. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా వ్యవహరించిన టీజేఎస్ పార్టీ వ్యవస్థాపకుడు కోదండం మాష్టారు తాజాగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలవాలని భావించటం తెలిసిందే. ఇందులో భాగంగా చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా అన్ని పార్టీలతోనూ.. ప్రజాసంఘాల మద్దతును కోరుతున్న సంగతి తెలిసిందే.

చివరకు జాతీయ స్థాయిలో తాను వ్యతిరేకించే బీజేపీ మద్దతును కూడా ఆయన కోరటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.ఓవైపు బీజేపీ మద్దతును కోరిన కోదండం మాష్టారు.. మరోవైపు కాంగ్రెస్ మద్దతు కూడా కోరటం గమనార్హం.

నల్గొండ.. వరంగల్.. ఖమ్మం జిల్లాలకు కలిపి నిర్వహించే పట్టభద్రుల ఎన్నికల్లో బరిలోకి దిగాలని బలంగా భావిస్తున్న కోదండం మాష్టారు.. భారీ ఎత్తున గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. మాములు ఎన్నికల్లో తన సత్తా చాటే టీఆర్ఎస్.. ఎమ్మెల్సీ ఎన్నికలు.. అందునా పట్టభద్రుల ఎన్నికల్లో మాత్రం తన బలాన్ని ప్రదర్శించలేదన్న విమర్శ ఉంది. అందుకు తగ్గట్లే గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఉండటాన్ని మర్చిపోకూడదు.

దీన్నో అవకాశంగా తీసుకొని.. చట్టసభల్లోకి తాను ఎంట్రీ ఇవ్వాలని కోదండం మాష్టారు భావిస్తున్నట్లు చెబుతున్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో ఉద్యమకాలంలో కీలకంగా వ్యవహరించిన వారంతా ఇప్పుడు టీఆర్ఎస్ కు దూరమైనట్లుగా కోదండం మాష్టారు భావిస్తున్నారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరిపై విద్యార్థులు.. నిరుద్యోగులు.. ఉన్నత విద్యావంతులు గుర్రుగా ఉన్నట్లు భావిస్తున్నారు. వీరంతా తన గెలుపుకు సాయంగా నిలుస్తారన్నది ఆయన అంచనా.

ఇదిలా ఉంటే.. తాజాగా కాంగ్రెస్ మద్దతు కోరిన నేపథ్యంలో.. కోదండం మాష్టారికి ఆ పార్టీ అండగా నిలుస్తుందా? అన్నది ప్రశ్నగా మారింది. ఎందుకంటే జాతీయ స్థాయిలో తమ ప్రత్యర్థి అయిన బీజేపీ మద్దతును కోదండం మాష్టారు కోరటంతో ఆ పార్టీ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. బీజేపీ మద్దతు లేకుండా తమ మద్దతుతో కోదండం మాష్టారు బరిలోకి నిలిస్తే మద్దతు ఇవ్వాలన్నట్లుగా సమాచారం.

అయితే.. అందుకు కాంగ్రెస్ లో ఎస్ అనే వారితో పాటు.. నో చెబుతున్న వారు లేకపోలేరని చెబుతున్నారు. కోదండం మాష్టారి మీద ఉన్న అభిమానంతో ఆయన పోటీ చేస్తున్న స్థానం నుంచి తాము బరిలోకి దిగకుండా సహకారం తీసుకొని.. మిగిలిన ఎన్నికల్లో ఆయన పార్టీ మద్దతు కోరితే బాగుంటుందన్న మాట కొందరు ప్రతిపాదించగా.. మరికొందరు నేతలు తప్పు పట్టినట్లుగా తెలుస్తోంది.

2018లో జరిగిన ఎన్నికల్లో కోదండం మాష్టారి టీజేఎస్ ఎలాంటి ప్రభావం చూపించని నేపథ్యంలో.. ఆ పార్టీ కారణంగా తమకు ఎలాంటి ప్రయోజనం లభించదని.. అలాంటప్పుడు ఆయనకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఏమిటన్న చర్చ కూడా కాంగ్రెస్ లో నడుస్తోంది. అయితే.. మాష్టారి ప్రతిపాదనను..కాంగ్రెస్ అధిష్ఠానం ముందు పెడదామని.. అక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకుంటే.. దాన్ని ఫాలో అవుదామన్న మాటకు కాంగ్రెస్ నేతలు ఓకే అన్నట్లుగా తెలుస్తోంది. మరి.. కోదండం మాష్టారికి కాంగ్రెస్ మద్దతు ఉంటుందా? లేదా? అన్నది అధినాయకత్వం తేల్చాల్సి ఉంటుంది.