వ్యాపారానికి దూరంగా కూట‌మి ప్ర‌భుత్వం.. మంచిదేనా?

ప్ర‌భుత్వం అంటే.. ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డం కోస‌మే ఏర్ప‌డుతుంద‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే.. గ‌త వైసీపీ ప్ర‌భుత్వం సేవ చేస్తూనే.. మ‌రోవైపు వ్యాపారాలు కూడా చేసింది. ముఖ్యంగా ఇసుక వ్యాపారం, మద్యం వ్యాపారం వంటివి స‌ర్కారు స్వ‌యంగా చేప‌ట్టింది. కొన్ని చోట్ల ఇసుక‌ను ప్రైవేటుకు ఇచ్చినా.. మద్యం విష‌యంలో మాత్రం వైన్స్ షాపుల‌న్నీ స‌ర్కారే నిర్వ‌హించింది. ఎక్క‌డా ప్రైవేటుకు అప్ప‌గించ‌లేదు. ఈ వ్య‌వ‌హారంపై అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

నాసిర‌కం మ‌ద్యం విక్ర‌యిస్తున్నార‌ని, ఫేన్ పే, గూగుల్ పే వంటి డిజిట‌ల్ పేమెంట్స్ కాకుండా క్యాష్ రూపంలో తీసుకుంటున్నార‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఆ సొమ్ములు వైసీపీ పెద్ద‌ల‌కు త‌రలి పోతున్నాయ‌ని కూడా చెప్పుకొచ్చారు. ఇదిలావుంటే.. వాటిపై విచార‌ణ అయితే.. కొన‌సాగుతోంది. ఇప్పుడు కూట‌మి ప్ర‌భుత్వం వ్యాపారాల జోలికి పోవ‌డం లేదు. అంతా కూడా ప్రైవేటు మంత్రాన్ని ప‌ఠిస్తోంది. ఇసుక‌ను ఉచితంగా అందిస్తున్నారు. అయితే.. ర‌వాణా కాంట్రాక్టును ప్రైవేటుకు ఇచ్చారు.

దీనిని బ‌ల‌వంతంగా రుద్ద‌కుండా.. వినియోగ‌దారుల ఇష్టానికే వ‌దిలేశారు. ఇక‌, మ‌ద్యం విష‌యంలో పూర్తిగా ప్ర‌భుత్వం త‌ప్పుకొంటోంది. ఈ నెల 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు దుకాణాలు ఏర్ప‌డ‌నున్నాయి. 3286 దుకాణాల‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీనివ‌ల్ల పూర్తిస్థాయిలో ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు స‌మ‌యం కేటాయించే చాన్స్ ఉంటుంద‌ని స‌ర్కారు త‌ల‌పోస్తోంది. అయితే.. ఇలా ప్రైవేటుకు అప్ప‌గించ‌డం మంచిదేనా? అంటే.. ఒక కోణంలో చూసుకుంటే.. స‌ర్కారు వ్యాపారం చేయ‌దు కాబ‌ట్టి మంచిదే!

కానీ, మ‌రోకోణంలో చూసుకుంటే.. గ‌త వైసీపీ స‌ర్కారుకు ఈ రెండే కీల‌క ఆదాయ వ‌న‌రులుగా మారాయి. ఇసుక‌పై ఏటా 17 వేల కోట్ల రూపాయ‌ల‌కు పైగా ఆదాయం వ‌చ్చింది. ఇప్పుడు ఈ ఆదాయాన్ని పూర్తిగా కూట‌మి స‌ర్కారు ఉచిత ఇసుక పేరుతో కోల్పోయింది. అయితే.. సీన‌రేజీ రూపంలో ఏటా 3 నుంచి 4 వేల కోట్లు మాత్ర‌మే రానుంద‌ని లెక్క గ‌ట్టారు. ఇక‌, మ‌ద్యం వ్యాపారం ద్వారా.. వైసీపీ స‌ర్కారుకు ఏటా 7 వేల కోట్లు వ‌చ్చాయి. ఇప్పుడు లైసెన్సుల‌కు ఇచ్చేస్తున్నారు కాబ‌ట్టి.. దీనిలో స‌గం మాత్ర‌మే కూట‌మి స‌ర్కారుకు రానుంది., కానీ, ప‌థ‌కాల‌ను చూసుకుంటే వైసీపీ హ‌యాంలో కన్నా ఎక్కువ‌గా ఉన్నాయి. అయినా.. సర్కారు తీసుకున్న ‘వ్యాపారం చేయ‌రాదు’ అన్న లైన్ మాత్రం హ‌ర్ష‌ణీయంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.