ఆర్పీ నోటికి తాళాలు వేయాలి

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ముంగిట, తర్వాత కూటమి తరఫున బలంగా వాయిస్ వినిపించడం ద్వారా పాపులర్ అయిన వ్యక్తులు కిర్రాక్ ఆర్పీ ఒకడు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా వెలుగులోకి వచ్చి.. ఆ తర్వాత నెల్లూరు చేపల పులుసు పేరుతో కర్రీ పాయింట్లు తెరిచి పాపులర్ అయ్యాడు ఆర్పీ. ఎన్నికల ముంగిట అతను తెలుగుదేశం పార్టీలో చేరి.. ఆ పార్టీతో పాటు జనసేనకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నాడు.

మాజీ మంత్రి రోజాతో పాటు వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ అతను చేసిన వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతుగా ప్రచారం చేసిన అల్లు అర్జున్‌ను అతను టార్గెట్ చేస్తూ వీడియోలు పెట్టినపుడు మరింతగా పాపులారిటీ వచ్చింది. మంచి ఫ్లోతో, ఫైర్‌తో మాట్లాడుతున్నాడని టీడీపీ, జనసేన మద్దతుదారులు ఆర్పీకి మంచి ఎలివేషన్లు ఇచ్చారు. తన పాపులారిటీని ఇంకా పెంచారు.

ఐతే ఈ మధ్య ఆర్పీ మరీ హద్దులు దాటి మాట్లాడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రోజాను టార్గెట్ చేసే క్రమంలో అతను తాజాగా పూర్తిగా అదుపు తప్పాడు. తిరుమల లడ్డులో జంతు కొవ్వులు ఉన్నాయన్న ఆరోపణలను రోజా ఖండిస్తూ ఇటీవల ఒక వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆర్పీ స్పందిస్తూ.. తీవ్ర అభ్యంతకర వ్యాఖ్యలు చేశాడు.

తిరుమల లడ్డులో ఉన్నది రోజా కొవ్వే అని అతను వ్యాఖ్యానించడం గమనార్హం. రోజా తన దృష్టిలో పంది అని.. లడ్డులో వాడిన నెయ్యిలో పంది కొవ్వు ఉన్నట్లుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అది రోజా కొవ్వే అయి ఉండొచ్చని.. అందుకే రోజా తాను శ్రీవారి కోసం ఏదో చేశానని ఫీలవుతోందంటూ జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశాడు ఆర్పీ. వైసీపీ నేతలు ఇలా నోటికి అడ్డు అదుపు లేకుండా.. టీడీపీ, జనసేన నేతల మీద దారుణమైన వ్యాఖ్యలు చేయబట్టే జనాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమై వాళ్లకు ఓటుతో బుద్ధి చెప్పారు. అది తెలిసి కూడా ఆర్పీ లాంటి వాళ్లు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విచారకరం. వీళ్లంతట వీళ్లు ఇలాంటి వ్యాఖ్యలను నివారించాలి.. లేదా వీళ్ల నోటికి టీడీపీ నేతలైనా తాళం వేయించాలి. లేదంటే వైసీపీకి వీళ్లకు తేడా ఏంటి అనే ప్రశ్న జనాల్లో తలెత్తుతుంది.