మెకానిక్ లనే ఇంటికి తెప్పిస్తున్న ఏపీ సర్కారు

ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌లుచుకుంటే ఏదైనా సాధ్య‌మే. అత్యంత విప‌త్తులో ఉన్న విజ‌య‌వాడ శివారు ప్రాంతాన్ని ఆదుకుంటామ‌ని ఆయ‌న చెప్పిన మాట తూ.చ‌. త‌ప్ప‌కుండా అమ‌ల‌వుతోంది. ఎన్న‌డూ ఊహించని రీతిలో ప్ర‌స్తుతం విజ‌య‌వాడ శివారు ప్రాంతానికి వ‌ర‌ద వ‌చ్చింది. మ‌నిషి లోతు నీళ్లు కాల‌నీల‌కు కాల‌నీల‌ను ముంచెత్తాయి. దీంతో ప్ర‌జ‌లు క‌ట్టుబ‌ట్ట‌ల‌తో ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని బ‌య‌ట‌పడ్డారు. గ‌త వారం రోజులుగా ఇబ్బంది పెట్టిన వ‌ర‌ద ఇప్పుడు త‌గ్గుముఖం ప‌డుతోంది.

దీంతో స‌మ‌స్తం కోల్పోయిన ప్ర‌జ‌లు ఇళ్ల బాట‌ప‌డుతున్నారు. అయితే.. అన్ని ప్రాంతాల్లోనూ ఇంట్లోని అత్యంత విలువైన వస్తువులు పాడైపోయాయి. ముఖ్యంగా ప్ర‌తి ఇంటికీ ఇటీవ‌ల కాలంలో బైక్ కామ‌న్ అయిపోయింది. అయితే వ‌ర‌ద‌ల‌తో బైకులు కూడా నీట‌మునిగి రోజుల త‌ర‌బ‌డి నాన‌డంతో ఇంజన్లు పాడైపోయాయి. టైర్లు కూడా కొన్ని వంద‌ల బైకుల‌కు పాడైపోయాయి. ఈ విష‌యాన్ని బాధితులు సీఎం చంద్ర‌బాబు దృష్టికి తెచ్చారు.

బైకులు… ఇళ్ల‌లోని టీవీలు, ఫ్రిడ్జ్‌లు, ఇత‌ర గృహోప‌క‌ర‌ణాలు కూడా నీట మునిగిపాడైపోయాయి. దీంతో చంద్ర‌బాబు వారికి బ‌ల‌మైన హామీ ఇచ్చారు. ఇత‌ర ప్రాంతాల నుంచి అయినా.. మెకానిక్‌ల‌ను తీసుకువచ్చి.. బ‌ళ్లు బాగుచేయించి ఇచ్చే బాద్య‌త‌ను తాను వ్య‌క్తిగ‌తంగా తీసుకుంటాన‌ని చెప్పారు. అన్న‌ట్టుగానే .. ఈ హామీ ఇచ్చిన 24 గంటల్లోనే చంద్ర‌బాబు వేర్వేరు ప్రాంతాల నుంచి మెకానిక్‌ల‌ను విజ‌య‌వాడ‌కు తీసుకువ‌చ్చారు. వీరంతా కూడా.. ఆర్టీసీ… పోలీసు, అగ్నిమాప‌క‌, ఇత‌ర ప్ర‌భుత్వ విభాగాల్లో ప‌నిచేసే స్కిల్డ్ టెక్నీషియ‌న్స్‌.

వీరితోపాటు.. ప‌లు ప్ర‌ముఖ కంపెనీలు టీవీఎస్‌, హీరో హోండా, సుజుకి త‌దిత‌ర కంపెనీల‌తోనూ మాట్లాడి .. ఆయా కంపెనీల్లోని మెకానిక్‌ల‌ను తీసుకువ‌చ్చారు. సోమ‌వారం మ‌ధ్యాహ్నం నుంచి వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లోయుద్ద ప్రాతిప‌దిక‌న బైకులు రిపేర్ చేసే ప‌నిని చేప‌ట్టారు. రేయింబ‌వ‌ళ్లు ఈ ప‌నులు సాగుతాయని.. పోలీసులు కాప‌లాగా ఉంటార‌ని జిల్లా క‌లెక్ట‌ర్ సృజ‌న తెలిపారు. దీంతో బైక‌ర్లు.. ఇప్పుడు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఇదిలావుంటే.. టీవీలు, ఫ్రిడ్జ్‌లు బాగు చేయ‌డ‌మా..? లేక‌.. ఇన్సూరెన్స్ ఇప్పించ‌డ‌మా? అనేది ప్ర‌భుత్వం ఆలోచిస్తోంది.