కాంగ్రెస్, బీజేపీలకు కొరకరాని కొయ్యగా ఏలేటి !

తెలంగాణ బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ముఖ్యమంత్రిపై చేస్తున్న అవినీతి ఆరోపణలు అధికార కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారడంతో పాటు, సొంత పార్టీ బీజేపీలోనూ చర్చకు దారితీస్తున్నాయి. ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్, యూ ట్యాక్స్ అంటూ ఏలేటి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.

ఏకంగా లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ అని ఆరోపించడం కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో నష్టం చేకూర్చింది. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష 50 వేల కోట్లతో చేపట్టాలని భావిస్తున్న మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అతి పెద్ద కుంభకోణం అని ఏలేటి చేస్తున్న వ్యాఖ్యాలు కలకలం రేపుతున్నాయి.

మూసీ ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం కింద ఇచ్చిన రూ.3500 కోట్లు రాష్ట్రంలోని ఆస్థాన గుత్తేదార్లు పంచుకున్నారని, దీని మీద విచారణ జరిపించాలని ఏలేటి డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏలేటి 2023 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు.

ఏలేటి సీనియారిటీని గుర్తిస్తూ బీజేపీ అతడిని బీజేపీ ఎల్పీ నేతగా నియమించింది. ఈ నేపథ్యంలో అందరు శాసనసభ్యులను సమన్వయం చేసి, రాష్ట్ర అధ్యక్షుడితో చర్చించి ఆరోపణలు చేయాల్సి ఉండగా అసలు పార్టీలో తాను చేసే ఆరోపణలపై ఎవరికీ సమాచారం ఇవ్వడం లేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

కాంగ్రెస్ పార్టీలో ఉన్పప్పటి నుండే రేవంత్ వ్యతిరేకిగా ఏలేటికి ముద్ర ఉంది. అయితే రాహుల్, రేవంత్ తో పాటు ఒకప్పుడు కాంగ్రెస్ లో తాను సన్నిహితంగా మెలిగిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో పాటు మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని టార్గెట్ చేయడంతో అసలు ఏలేటి స్కెచ్ ఏంటో అర్ధం కాక కాంగ్రెస్ మంత్రులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తుంది. అసలు ఈ ఆరోపణలకు సంబంధించి ఏలేటి వద్ద ఏం ఆధారాలు ఉన్నాయి ? ఆయన ఏం చేయబోతున్నాడు అన్నది కాలం గడిస్తేనే తెలుస్తుంది.