ఢిల్లీ ధ‌ర్నా: జ‌గ‌న్‌కు క‌లిసి వ‌చ్చింది కేసీఆర్ మిత్రులేనా?

దేశ రాజ‌ధాని ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ధ‌ర్నా చేప‌ట్టిన వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌కు క‌లిసి వ‌చ్చింది ఎవ‌రు? ఎంత మంది ఆయ‌న వెంట ఈ ధ‌ర్నాకు చేతులు క‌లిపారు? అనే విష‌యాలు ఆస‌క్తిగా మారాయి. వాస్త‌వానికి వైసీపీలో ఉన్న వారంతా ఢిల్లీ బాట ప‌ట్టారు. పార్టీనే ఖ‌ర్చులు భ‌రించి.. విమానాలు కూడా బుక్ చేయించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. దీంతో సీనియ‌ర్లు, జూనియ‌ర్లు అంద‌రూ క‌లిసి హ‌స్తిన బాట ప‌ట్టారు. అక్క‌డ ధ‌ర్నా కూడా చేస్తున్నారు.

అయితే.. జ‌గ‌న్ పిలుపు సొంత పార్టీ నేత‌ల గురించి కాదు.. పొరుగు పార్టీల నుంచి మ‌ద్ద‌తు స‌మీక‌రించాలనేదిఆయ‌న వ్యూహం. త‌ద్వారా.. చంద్ర‌బాబును బ‌ద్నాం చేయాల‌న్న‌ది కూడా.. ప్ర‌ధాన ల‌క్ష్యం. ఈ క్ర‌మంలోనే ఆయ‌న క‌లిసి వ‌చ్చే పార్టీల‌కు రెడ్ కార్పెట్ ప‌రుస్తున్న‌ట్టు చెప్పారు. జ‌గ‌న్ దృష్టిలో క‌మ్యూనిస్టులు క‌లిసి వ‌స్తార‌ని వైసీపీ నాయ‌కులు భావించారు. కానీ, వారు రాలేదు. దీనికి అనేక కార‌ణాలు ఉన్నాయి. మోడీతో తెర‌చాటు చెలిమి కొన‌సాగిస్తుండ‌డం.. ఏపీ ప్రాధాన్యాలు మ‌రిచిపోవ‌డం.

వీటితోపాటు.. అధికారంలో ఉన్న‌ప్పుడు.. క‌మ్యూనిస్టుల‌ను ఏవ‌గించుకోవ‌డం. ఆ పార్టీలు ఉన్నాయా? అంటూ.. పార్టీ స‌మావేశంలోనే ఆయ‌న వ్యాఖ్య‌లు చేయ‌డం వంటివి క‌మ్యూనిస్టుల‌ను దూరం చేశాయి. ఒక‌రిద్ద‌రు వ్య‌క్తిగ‌తంగా కామ్రెడ్స్ జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించినా.. పార్టీ ప‌రంగా మాత్రం అంద‌రూ దూరంగానే ఉన్నారు. ఇక‌, ఇప్పుడు క‌లిసి వ‌చ్చిన ఏకైక పార్టీ.. అఖిలేష్ యాద‌వ్. యూపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం స‌మాజ్ వాదీ పార్టీ అధినేత‌.

ఇక్క‌డ కూడా.. కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంద‌నే టాక్ వినిపిస్తోంది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ప్రోద్బ‌లంతోనే అఖిలేష్ యాద‌వ్ ముందుకు క‌దిలిన‌ట్టు స‌మాచారం. గ‌తంలో కేసీఆర్‌తో క‌లిసి అడుగులు వేసేందుకు అఖిలేష్ ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. త‌ర్వాత‌.. కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల‌ను విర‌మించుకున్నారు. అయినా.. స్నేహం కొన‌సాగుతున్న ద‌రిమిలా.. జ‌గ‌న్ కోసం.. ఆయ‌న ఫోన్ చేసి.. అఖిలేష్ను ఒప్పించార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు అఖిలేష్ , అదేవిధంగా శివ‌సేన ఉద్ద‌వ్ ఠాక్రే (ఈయ‌న కూడా కేసీఆర్ మిత్రుడే) మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.