బడ్జెట్ మీద వైసీపీ గప్‌చుప్

ఇవాళ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు. మామూలుగా అయితే ఏపీ వాళ్లకు పెద్దగా బడ్జెట్ మీద ఆశలుండేవి కావు. ఎన్నో ఏళ్ల నుంచి ఏపీకి బడ్జెట్లో రిక్త హస్తమే మిగులుతోంది. 2014-18 మధ్య కేంద్రంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా ఉన్నా సరే.. చెప్పుకోదగ్గ స్థాయిలో కేటాయింపులు లేవు. ఆ తర్వాత వైసీపీ హయాంలో పరిస్థితి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

గత పదేళ్లు ఎవరి మీదా ఆధారపడకుండా సొంతంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో బడ్జెట్లో ఏపీకి కేటాయింపులే ఉండేవి కావు. కానీ ఈసారి తెలుగుదేశం, జనసేన మీద ఆధారపడాల్సి రావడంతో బడ్జెట్లో కేటాయింపులు పెద్ద స్థాయిలోనే ఇచ్చింది కేంద్రం. రాజధాని అమరావతి కోసం రూ.15 వేల కోట్లతో పాటు పోలవరం సహా అనేక ప్రాజెక్టులకు నిధులు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. దీంతో రాష్ట్ర జనాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీకి మంచి రోజులు వచ్చాయని సంబరపడుతున్నారు.

కానీ ఈ సమయంలో ప్రతిపక్ష వైసీపీ మాత్రం మౌనం వహిస్తోంది. వైసీపీ అధికార హ్యాండిల్లో ఏపీకి దక్కిన కేటాయింపుల గురించి ఒక్క ట్వీట్ కూడా వేయని పరిస్థితి. కొత్త ఉద్యోగలకు డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్‌ఫర్ స్కీమ్ అమలు చేయబోతుండడాన్ని ప్రస్తావిస్తూ.. ఇది జగన్ ప్రభుత్వ స్ఫూర్తితో తీసుకున్న నిర్ణయం అంటూ సంబంధంలేని లంకె పెట్టి ఎలివేషన్లు వేసుకున్నారు తప్ప.. ఏపీకి భారీ స్థాయిలో కేటాయింపులు జరిగితే దాని ఊసు మాత్రం లేదు.

జగన్ సహా వైసీపీ అగ్ర నేతల్లో చాలా వరకు కూడా బడ్జెట్ గురించి మాట్లాడకుండా సైలెంట్ అయిపోయారు. అంబటి రాంబాబు మాత్రం 15 వేల కోట్లు అమరావతికే ఇస్తే.. మిగతా రాష్ట్రం పరిస్థితి ఏంటి అంటూ ఒక ట్వీట్ వేశారు. రాష్ట్రానికి మంచి జరుగుతుంటే రాజకీయాలు పక్కన పెట్టి బడ్జెట్‌పై సానుకూలంగా స్పందించాల్సింది పోయి.. కూటమి ప్రభుత్వానికి ఎక్కడ క్రెడిట్ వచ్చేస్తుందో అని వైసీపీ వాళ్లు బాధ పడుతున్నట్లు కనిపిస్తోంది. వచ్చే ఐదేళ్లు కూడా వైసీపీ ఇలాగే బాధ పడక తప్పని పరిస్థితే ఉంటుందేమో.