రూ.2.2 లక్షల కోట్లు .. మూడు కోట్ల ఇండ్లు

ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద దేశంలోని ఇళ్లులేని పేదలకు మూడు కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మూడు కోట్ల ఇళ్లు నిర్మిస్తామని, ఈ మేరకు బడ్జెట్‌లో కేటాయింపులు కూడా చేశామని తెలిపారు.

తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో గృహ నిర్మాణాలకు రూ.2.2 లక్షల కోట్లు కేటాయించారు. వచ్చే ఐదేండ్లలో ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తామని అన్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రూ.2.26 లక్షల కోట్లు కేటాయించారు. ముద్రా రుణాలను రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించారు.

మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కోసం బడ్జెట్‌లో రూ.11.11 లక్షల కోట్లు కేటాయించారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి తాము ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు.

ఎంఎస్‌ఎంఈ క్లస్టర్లు, నూతన సిడ్‌బీ బ్యాంకు బ్రాంచ్‌లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎగుమతులు, ఎగుమతుల సేవల కోసం ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌ ఏర్పాటు చేస్తామని, 500 పెద్ద కంపెనీల్లో కోటి మంది యువతకు ఉద్యోగాలను కల్పిస్తామని తెలిపారు.

దేశంలోని వంద నగరాల్లో ప్లగ్‌ అండ్‌ ప్లే తరహాలో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తామని, దేశవ్యాప్తంగా 12 విస్తృతస్థాయి పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల కోసం అద్దె గృహాలను నిర్మించనున్నట్లు వెల్లడించారు.