‘హిట్’ లిస్టులో హేమా హేమీలు.. వైసీపీలో క‌ల‌క‌లం!

ఏపీలో ప్ర‌తిప‌క్షం వైసీపీలో తీవ్ర రాజ‌కీయ క‌ల‌క‌లం రేగింది. తాజాగా క‌దిరి మాజీ ఎమ్మెల్యే సిద్దారెడ్డిని పార్టీ నుంచి స‌స్పెండ్ చేసిన త‌ర్వాత‌.. అస‌లు విష‌యాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా మీడియాతో మాట్లాడిని వైసీపీ కీల‌క నాయ‌కుడు ఒక‌రు.. ఆఫ్ దిరికార్డుగా ‘హిట్ లిస్ట్‌’ చాలా పెద్ద‌దిగానే ఉందంటూ వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. రాష్ట్రంలో పార్టీ అధికారం కోల్పోవ‌డం వెనుక‌.. రాజ‌కీయ కార‌ణాలు ఎలా ఉన్నా.. సొంత నేత‌లే గుంత‌లు త‌వ్వార‌ని జ‌గ‌న్ న‌మ్ముతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ ఎన్నిక‌ల్లో 58 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు జ‌గ‌న్ టికెట్ ఇవ్వ‌లేదు.

వీరిలో ఐదారుగురు పొరుగు పార్టీల్లోకి వెళ్లి టికెట్లు తెచ్చుకుని విజ‌యం ద‌క్కించుకున్నారు. ఒక‌రిద్ద‌రు మాత్ర‌మే దూరంగా ఉన్నారు. అయితే..అవ‌కాశం ద‌క్క‌క‌.. టికెట్ రాక‌.. జ‌గ‌న్‌పై ఆగ్ర‌హంతో ఉన్న కొంద‌రు సీనియ‌ర్ నాయ‌కులు.. పార్టీకి వ్య‌తిరేకంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో అప్ప‌టి ప్ర‌తిప‌క్షాల‌తో అంట‌కాగార‌ని జ‌గ‌న్‌కు స‌మాచారం ఉంది. అయితే.. సాధార‌ణంగా వారంత‌ట వారు దూర‌మ‌వుతార‌ని.. భావించే జ‌గ‌న్ ఎప్పుడూ ఎవ‌రిపైనా తీవ్ర చ‌ర్య‌లు అయితే తీసుకోలేదు. ఒక్క ఎమ్మెల్సీ ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీకి వ్య‌తిరేకంగా ఓటేసి.. బ‌లంలేక‌పోయినా.. టీడీపీని గెలిపించారంటూ.. న‌లుగురు ఎమ్మెల్యేల‌పై వేటు వేశారు.

ఆ త‌ర్వాత‌.. ఎవ‌రిపైనా జ‌గ‌న్ చ‌ర్య‌లు తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఓడిపోయిన త‌ర్వాత‌..వైసీపీ కీల‌క అంశాల‌ను అధికార పార్టీతో పంచుకోవ‌డం.. క్షేత్ర‌స్థాయిలో పార్టీ ఓట‌మికి దోహ‌ద ప‌డ్డార‌ని.. జ‌గ‌న్‌కు ప‌క్కా నివేదిక‌లు అందాయి. దీంతో ఇప్పుడు ఆయ‌న హిట్ లిస్టును రూపొందించిన‌ట్టు తెలుస్తోంది. తొలి వేటు సిద్దారెడ్డిపైనే ప‌డినా.. త్వ‌ర‌లోనే 10 నుంచి 12 మంది కీల‌క నాయ‌కుల‌ను దూరం పెట్టే అవ‌కాశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని పార్టీ సీనియ‌ర్ నేత ఒక‌రు మీడియాతో ఆఫ్‌ది రికార్డుగా చెప్పుకొచ్చారు. కొద్దిరోజుల కిందటే అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో వరుసగా సమీక్షలను సైతం చేపట్టారు.

అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలవారీగా పార్టీ నాయకులు, ఇన్‌ఛార్జీలు, జిల్లా అధ్యక్షులతో సమావేశం అయ్యారు. ఈ క్రమంలో పార్టీలో ఉంటూ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారి జాబితాను ఆయ‌న రెడీ చేసుకున్నార‌ని స‌మాచారం. దీంతో ఇలాంటి వారికి వార్నింగ్‌తో స‌రిపుచ్చ‌కుండా.. పార్టీ నుంచి బ‌య‌ట‌కు పంపించ‌డ‌మే భేష్ అని భావించారు. ఈ క్ర‌మంలోనే సిద్దారెడ్డిపై తొలి వేటు పడింది. అయితే.. నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలపైనా త్వ‌ర‌లోనే వేటు ప‌డుతుంద‌ని స‌మాచారం. పిఠాపురం మాజీ ఎమ్మెల్యేను కూడా పార్టీ నుంచి తీసేస్తార‌ని అంటున్నారు. ఈయ‌న కు కూడా టికెట్ ఇవ్వ‌లేదు. దీంతో ప‌వ‌న్‌కు ఈయన స‌హ‌క‌రించార‌నే వాద‌న ఉంది. ఎలా చూసుకున్నా.. ఇలాంటి హేమా హేమీల జాబితాపై హాట్ హాట్‌గా చ‌ర్చ సాగుతోంది.