మరికొద్ది రోజుల్లోనే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే రైతు రుణమాఫీని పూర్తిచేసి స్థానిక సంస్థలు ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. రైతు రుణమాఫీకి కూడా ఆయన గడువు పెట్టారు. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించారు. అంటే కేవలం మరో నెల రోజులు మాత్రమే దీనికి గడువు ఉంది. ఆ తర్వాత ఏ క్షణమైనా స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇది కేసీఆర్ కు తీవ్ర సంకటంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఎందుకంటే ఇప్పటికే ఉచిత బస్సు పథకంతో కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో ప్రజలను ఆకర్షించింది. ఇక ఇప్పుడు రైతు రుణమాఫీ ద్వారా క్షేత్రస్థాయిలో రైతాంగాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తే గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మరింత పుంజుకునే అవకాశం ఉంది. నిజానికి గ్రామీణ స్థాయిలో ఒకప్పుడు కాంగ్రెస్ బలంగానే ఉంది. అయితే ఈ బలాన్ని బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ గడిచిన పదేళ్లలో తన వైపు తిప్పుకోగలిగారు. కానీ గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ స్థాయిలో ఓటు బ్యాంకు బీఆర్ఎస్ కు దూరంగా జరిగింది. కేసీఆర్ అనుసరించిన విధానాలు కావచ్చు లేదా దళిత బంధువు వంటి కీలకమైన పథకాలను కొన్ని ప్రాంతాలకే పరిమితం చేసిన పద్ధతి కావచ్చు.
లేదా ఇతర పథకాల విషయంలో కావచ్చు మొత్తంగా గ్రామీణ స్థాయిలో ప్రజలు కేసీఆర్ పై ఆగ్రహంతో ఉన్నారు. ఇదే సమయం లో ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా జిల్లాల స్థాయిలో కేసీఆర్ ఇప్పటివరకు పర్యటన చేయలేదు. పోనీ ఇతర నాయకులైనా చేశారంటే అది కూడా లేదు. ఎవరికి వాళ్లు మౌనంగా ఉండిపోయారు. మరికొందరు పార్టీలు మారుతున్నారు. ఈ నేపథ్యంలో వస్తున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ నాయకులు ఏ మేరకు కేసిఆర్ కు సహకరిస్తారు? కేసీఆర్ వెంట నడుస్తారు? అనేది కూడా చర్చనీయాంశంగా మారింది.
ఇంకోవైపు స్థానిక స్థాయిలో పార్టీని గెలిపించుకోవాలని రేవంత్ రెడ్డి బలంగా ప్రయత్నిస్తున్నారు. దీనికి రైతు రుణమాఫీ తనకు ఎంతో మేలు చేస్తుందని ఆయన ఆశిస్తున్నారు. అందుకే ఇప్పటికే రైతు రుణమాఫీకి సంబంధించి ఉన్న నిబంధనలను సైతం ఎత్తేసి రెండు లక్షల లోపు ఎంత రుణమైనా తీరుస్తామని ఆయన ప్రకటన చేశారు. ఇది గ్రామీణ స్థాయిలో భారీ ప్రభావం చూపిస్తుంది. దీనిని అడ్డుకొని, దీనిని తట్టుకుని కేసీఆర్ ఏ విధంగా ముందుకు సాగుతారు? ఎలాంటి ప్రయత్నం చేస్తారు?. ఎలాంటి అంచనాలతో ముందుకు వెళ్తారు? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
ఈ విషయంలో కెసిఆర్ ఏ చిన్న వెనుకడుగు వేసినా మున్ముందు కేడర్ మరింత డీలా పడే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో పునాదులకు కదిలిపోతే కేసిఆర్ అస్థిత్వానికి ప్రమాదం ఏర్పడుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగానే ఉంది. క్షేత్రస్థాయిలో నాయకులు ముందుకు రాకపోవడం ఉన్న నాయకులు జండాలు మార్చేయటం వంటివి పార్టీని బలహీన పరుస్తున్నాయి. దానిని దృష్టిలో పెట్టుకుని స్థానిక సంస్థలకు ఏ విధంగా పుంజుకోవాలనే విషయంపై ఇప్పటి నుంచే కేసీఆర్ ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగితే తప్ప విజయం దక్కించుకోవడం కష్టమని పార్టీలో ఉన్నవారు సూచిస్తున్నారు. మరి కెసిఆర్ వ్యూహం ఎలా ఉంటుందో చూడాలంటే వెయిట్ చేయాల్సిందే.
This post was last modified on July 11, 2024 5:47 am
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…