ధ‌ర్మ‌శ్రీ చెప్పిన నిజాలు జ‌గ‌న్ కు వినిపిస్తాయా..?

వైసీపీలో లోపాలు బయట పడుతున్నాయి. ఒక్కొక్కరుగా నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. నిజానికి తప్పులు జరిగాయని అందరికీ తెలిసినప్పటికీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఎవరూ మాట్లాడలేదు. పైగా అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను ప్రతి ఒక్కరూ హర్షించారు. గొప్పగా చెప్పుకొచ్చారు. తమ నాయకుడు అంతటివాడు లేడని గొప్పలు చెప్పుకొచ్చారు. కానీ వాస్తవంలోకి వచ్చేసరికి అవన్నీ తప్పులు అన్న విషయం ప్రతి ఒక్క నాయకుడికి తెలుసు.

రాజధాని అమరావతి నుంచి రాష్ట్రంలోని రోడ్ల దుస్థితి వరకు ప్రతి ఒక్కరు మాట్లాడకుండా ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత మాట్లాడుతున్నారు. నిజానికి చెప్పాలంటే ఏదైనా తప్పులు ఉంటే అధికారంలో ఉన్నప్పుడే చెప్పి సరిదిద్దుకునేటటువంటి దిశగా నాయకులు వ్యవహరించి ఉండాల్సింది కానీ ఒకరిద్దరి విషయంలో జరిగినటువంటి అధిష్టానం నిర్ణయాల కారణంగా చాలామంది నాయకులు మౌనం పాటించారు. ఈ ఫలితంగా ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయింది. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు దిగజారిపోయినటువంటి పార్టీగా అపప్రద మూటగట్టుకుంది.

దీనిని జీర్ణించుకోలేని నాయకులు ఇప్పటివరకు మౌనంగా ఉండిపోయారు. తరచుగా కొందరు నాయకులు మాత్రం నోరు విప్పుతున్నా.. బలమైనటువంటి కారణాలను ఎత్తిచూపలేకపోతున్నారు. తాజాగా చోడ‌వ‌రం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చెప్పినటువంటి మాటలు గతంలో ప్రతిపక్షాలు చెప్పినటువంటి అంశాలనే ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రహదారులు బాగోలేదని ఎక్కడికి వెళ్లినా గోతుల మయంగా ఉందని అనేకమంది రాజకీయాలకు అతీతంగా చెప్పినవారు ఉన్నారు.

రాజకీయంగా చెప్పినటువంటి నేతలు కూడా ఉన్నారు. కానీ అప్పట్లో ఈ మాటలను వైసిపి నాయకులు పట్టించుకోలేదు. ఫలితంగా పార్టీ ఓట‌మి పాలైంది. ఇప్పుడు కరణం ధర్మశ్రీ చెప్పినటువంటి మాటలు వాస్తవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. గతంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ తన స్నేహితులు చెప్పారని ఏపీలో రహదారులు గోతులమయంగా ఉన్నాయని విమర్శలకు ఇప్పించారు. అప్పట్లో వైసిపి నాయకులు కేటీఆర్ పై ఎదురుదాడి చేశారే తప్ప వాస్తవాన్ని గ్రహించలేకపోయారు.

తర్వాత కాలంలో రాజకీయాలకు అతీతంగా రామానుజ జీయర్ స్వామి కూడా ఆంధ్రప్రదేశ్లో రహదారుల పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీలో ఎటు నుంచి ఎటు వెళ్లినా గోతులమయంగానే రోడ్లు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అప్పట్లోనూ స్వామి పై వైసీపీ నాయకులు విమర్శలు గుప్పించారే తప్ప వాస్తవాలను గ్రహించలేకపోయారు. కానీ ప్రజలు రహదారులు లేనటువంటి విషయాన్ని, రహదారులు గోతులు పడినటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో ఎత్తి చూపించారు.

ఇక ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ బిజెపి నాయకుడు కూడా అనేక సందర్భాల్లో ఆందోళన చేశారు. 2021 అక్టోబర్ 2న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో రహదారుల దుస్థితిపై పెద్ద ఉద్యమమే లేవనెత్తారు. ఎలా చూసుకున్నా జగన్ హయాంలో రాష్ట్రంలో రహదారిలో పరిస్థితి పట్టించుకోకపోవడం పెద్ద మైనస్ గా మారిందని చెప్పాలి. ఇప్పుడు కరణం ధర్మశ్రీ బయటపడినప్పటికీ మరికొందరు నాయకులు ఈ విషయంలో తన అభిప్రాయాలను వెల్లడించేందుకు ముందుకు వస్తారనే విష‌యంలో సందేహం లేదు.

తప్పులు జరిగాయి కానీ వాటిని సరిదిద్దుకునేటటువంటి అంశంలో అధిష్టానం.. నాయకులకు అవకాశం కల్పించలేదా లేకపోతే అధిష్టానం చెప్పినప్పుడు నాయకులు విని తీరాలి అన్నటువంటి ఉద్దేశంతో వ్యవహరించిందా? అనేది ఆసక్తిగా మారింది. ఏది ఏమైనా రాష్ట్రంలో పరిస్థితిని అర్థం చేసుకుని జగన్మోహన్ రెడ్డి వాస్తవాలు తెలుసుకునే దిశగా అడుగులు వేస్తారని ఆశిద్దాం.