వైసీపీ నేతలతో ‘ఆడుదాం ఆంధ్రా’

Chandrababu

అధికారం ఉందని అడ్డగోలుగా అక్రమాలకు, దాడులకు, వేధింపులకు గురిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద తెలుగుదేశం ప్రభుత్వం గురిపెట్టినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పలు కేసులను తిరగదోడేందుకు విచారణకు ఆదేశించింది.

టీడీపీ కేంద్ర కార్యాలయంపై 2021లో దాడి జరిగింది. కానీ ఇప్పటివరకు నిందితులు ఎవరో తేల్చలేదు. టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ కేసుపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ప్రభుత్వ ఆదేశాలతో కేసును రీ ఓపెన్‌ చేసిన పోలీసులు అప్పటి సీసీ పుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. ఈ దాడి చేసిన నిందితుల్లో ఎక్కువ మంది మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ తూర్పు ఇన్‌చార్జి దేవినేని అవినాశ్‌ అనుచరులు ఉన్నట్లు సమాచారం. నిందితులతో పాటు నేతలమీదా చర్యలు తీసుకుంటారని భావిస్తున్నారు.

ఇక కాకినాడలో ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్‌ హత్య కేసును, విశాఖలో డాక్టర్‌ సుధాకర్‌ కేసు పునర్విచారించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం. డాక్టర్‌ సుధాకర్‌ కేసు‌లో భూ సంబంధ వ్యవహారాలు ఉన్నాయని ప్రభుత్వం వద్ద సమాచారం ఉందని తెలుస్తుంది.

గత ఐదేళ్లలో రాష్ట్రంలో గనులు, ఎక్సైజ్‌ శాఖల్లో స్కాములు జరిగాయని, ఈ రెండు శాఖలతో పాటు ఆర్థిక శాఖలో నిధుల వినియోగంపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. ‌ ఎక్సైజ్‌ కేసులో బెవరేజస్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కుంభకోణంలో ఎవరి హస్తం ఉంది ? అన్న దానిపై తీవ్ర పరిశోధన జరుగుతుంది.

ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాయడం, ఇదే సమయంలో ప్రజాధనం తిరిగి వసూలు చేసేలా ప్రత్యేక చట్టం చేయాలని ఆ లేఖలో పేర్కొనడం విశేషం. ఓవరాల్ గా ఈ పరిణామాలను గమనిస్తే పక్కా వ్యూహంతో ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో వైసీపీ నేతల గుండెలు అదురుతున్నాయి.