ఇరికించబోయి ఇరుక్కున్న వైసీపీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే ఫేక్ ప్రచారాలకు కేరాఫ్ అడ్రస్ అనే అభిప్రాయం ఉంది సోషల్ మీడియాలో. 2019లో ఆ పార్టీ అధికారంలోకి రావడానికి ఆ ప్రచారాలే ఉపయోగపడ్డాయని అంటారు. సోషల్ మీడియాలో వేలమందిని రిక్రూట్ చేసుకుని పేటీఎం ద్వారా పేమెంట్స్ ఇవ్వడం ద్వారా అబద్ధాలను విస్తృతంగా ప్రచారం చేయించి.. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీని బద్నాం చేయడంలో ఆ పార్టీ విజయవంతమైంది.

ఐతే నిజం అనేది నిలకడ మీద తెలుస్తుందంటారు. ముందు జనాలను నమ్మించినా.. ఆ తర్వాత అసలు విషయం తెలిశాక బూమరాంగ్ అవ్వడం ఖాయం. తెలుగుదేశం హయాంలో ప్రమోషన్లు వచ్చిన డీఎస్సీలందరూ కమ్మలే అని.. వివేకానందరెడ్డి హత్య చంద్రబాబే చేయించారని.. కోడి కత్తితో జగన్ మీద దాడి చేయించింది టీడీపీనే అని.. ఇలా రకరకాలుగా ప్రచారం చేయించింది వైసీపీ. కానీ తర్వాత ఈ వ్యవహారాల్లో నిజానిజాలు బయటికి వచ్చి వైసీపీ మెడకే చుట్టుకున్నాయి.

పాత వ్యవహారాలు మెడకు చుట్టకుని ఇబ్బంది పడడమే కాదు.. ఈసారి ఎన్నికల ముందు చేసిన ఫేక్ ప్రచారాలు ఏవీ పని చేయలేదు. ఐతే అధికారం కోల్పోయాక కూడా ఆ పార్టీ తీరేమీ మారలేదు. చంద్రబాబు హయాంలో కట్టిన ప్రజా వేదిక కోసం రూ.900 కోట్లు పెట్టారని సాక్షి మీడియాలో ప్రచారం చేయడం వారికే చెల్లింది. వైసీపీ అధికార హ్యాండిల్లో కూడా ఇప్పటికీ ఫేక్ పోస్టులు పడుతూనే ఉంటాయి. తాజాగా అలాంటి ఒక పోస్టే ఆ పార్టీ మెడకు చుట్టుకుంది.

చంద్రబాబు ప్రభుత్వం హయాంలోకి వచ్చాక ‘999 పవర్ స్టార్’ పేరుతో ఒక మద్యం బ్రాండు అందుబాటులోకి వచ్చిందని.. నాణ్యమైన మద్యం తెస్తామని హామీ ఇచ్చి ఇదా మీరు చేసేది అంటూ వైసీపీ అధికారిక హ్యాండిల్లో ఒక పోస్ట్ పెట్టారు. ఇది చూసి జనం కొంత ఆశ్చర్యపోయారు. కానీ కాసేపటికే అసలు విషయం బయటికి వచ్చేసింది. 2022లో జగన్ హయాంలోనే ఈ బ్రాండును ప్రవేశపెట్టారు. ఒక మీటింగ్‌లో స్వయంగా పవన్ కళ్యాణే ‘పవర్ స్టార్’ అంటూ తన పేరుతో కూడా ఒక బ్రాండు తెచ్చారని ఎద్దేవా చేశాడు. దాని గురించి మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని టీడీపీ, జనసేన వాళ్లు ఎక్స్‌పోజ్ చేసి వైసీపీ పరువు తీశారు. అయినా సరే.. వైసీపీ హ్యాండిల్ నుంచి ఆ పోస్టు తొలగించకపోవడం గమనార్హం.