ఏపీలో ఆ ‘చైర్మ‌న్’ కుర్చీలు హాటు గురూ… !

కూట‌మి ప్ర‌భుత్వంలో ప‌ద‌వుల కోసం నాయ‌కులు ఎదురు చూస్తున్నారు. సీట్లు త్యాగం చేసిన వారు ఈ క్ర‌మంలో చాలా ముందున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో సీటు త్యాగం చేసిన వారికి స‌హజంగానే చంద్రబాబు హామీలు గుప్పించారు. ఈ క్ర‌మంలో వారు త‌మ సీట్ల‌ను వ‌దులుకున్నారు. ఇలాంటి వారిలో కొంద‌రు మారాం చేసి సీట్లు వ‌దులుకోగా.. మ‌రికొంద‌రు చంద్ర‌బాబు ఇలా చెప్ప‌గానే అలా వ‌దులుకున్నారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా చంద్ర‌బాబే చెప్పుకొచ్చిన విష‌యం తెలిసిందే.

ఇప్పుడు ఇలాంటి త్యాగ‌ధ‌నులు నామినేటెడ్ ప‌ద‌వుల రేసులో ముందున్నారు. అందునా.. కొంత ప్రాధాన్యం ఉండే.. ఏపీఎస్ ఆర్టీసీ చైర్మ‌న్ ప‌ద‌వి, పౌర‌స‌ర‌ఫరాల కార్పొరేష‌న్ చైర్మ‌న్‌, చేనేత కార్పొరేష‌న్ చైర్మ‌న్‌.. వంటి ప‌ద‌వులు చాలా హాట్ హాట్‌గా ఉన్నాయి. వీటిలో కొంత రాబ‌డి ఉండ‌డం.. అదేస‌మ‌యం లో స‌మాజంలోనూ గౌర‌వంగా ఉండ‌డం వంటివి నాయకుల‌ను ఊరిస్తున్నాయి. అంతేకాదు.. ఆయాప‌ద‌వులు చిక్కితే..రాష్ట్ర వ్యాప్తంగా కూడా..ఆయా విభాగాల‌పై అధికారం ద‌క్కుతుంది.

ఉదాహ‌ర‌ణ‌కు ఆర్టీసీ చైర్మ‌న్ ప‌ద‌వి ద‌క్కితే.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు ట్రావెల్స్ విష‌యంలో ప‌రోక్షంగా, ప‌బ్లిక్ ట్రాన్స్‌పోర్టు విష‌యంలో అధికారికంగా ప‌వ‌ర్ వ‌స్తుంది. ఇక‌, పౌర‌స‌ర‌ఫ‌రాల కార్పొరేష‌న్ చైర్మ‌న్ అయితే..రైసుమిల్లులు, బియ్యం రవాణా వంటి కీల‌క అంశంపై ప‌ట్టు దొరుకుతుంది. అంతో ఇంతో కొంత మేర‌కు జేబులు కూడా నిండే అవ‌కాశం ఉంది. ఇక‌, చేనేత కార్పొరేష‌న్ ద్వారా కీల‌క‌మైన వ‌స్త్ర రంగంపైనా అధికారం చ‌లాయించ‌వ‌చ్చు. ఇవి ప్రాధాన్యం ఉన్న రంగాలు, పోస్టులు.

దీంతో ఆయా ప‌ద‌వుల కోసం.. నాయ‌కులు క్యూ క‌డుతున్నారు. అధినేత ద‌గ్గ‌రే పంచాయితీ పెట్టేందుకు కొంద‌రు రెడీ అవుతున్నారు. మ‌రికొంద‌రు మాత్రం.. విన్న‌పాలు, విజ్ఞాప‌న‌లు.. త‌మ అనుభ‌వాల‌ను స‌రి చూసుకుంటున్నారు. దీంతో ఎవ‌రికి ఈ మూడు ప‌ద‌వులు చిక్కుతాయో చూడాలి. ప్ర‌స్తుతం కీల‌క నాయ‌కులు అయితే సిద్ధంగానే ఉన్నారు. చంద్ర‌బాబు నిర్ణ‌యం ఏమేర‌కు ఉంటుందో.. ఏమేర‌కు వీరిని క‌రుణిస్తారో చూడాలి.