ఈవీఎం టాంపరింగ్.. కొట్టిపారేసిన వైసీపీ నేత

2019 ఎన్నికల్లో 151 సీట్లతో వైసీపీ సాధించిన విజయంపై తెలుగుదేశం అనుమానాలు వ్యక్తం చేసింది. అప్పుడు ఈవీఎంల పనితీరుపై తెలుగుదేశం ఆరోపణలు చేస్తే అప్పటి సీఎం జగన్ తేలిగ్గా కొట్టి పారేశారు. కట్ చేస్తే ఇప్పుడు తెలుగుదేశం నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఏపీలో ఏకంగా 164 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితం అయింది. దీంతో ఇప్పుడు వైసీపీ వాళ్లు ఈవీఎం టాంపరింగ్ గురించి ఆరోపణలు చేస్తూ గగ్గోలు పెడుతున్నారు. కానీ గత పరిణామాల దృష్ట్యా వారి ఆరోపణలకు విలువ లేకుండా పోతోంది.

స్వయంగా సీఎం జగనే ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ ట్వీట్ పెడితే.. సోషల్ మీడియాలో ఆయన గతంలో ఈవీఎంల గురించి మాట్లాడిన వీడియోలు తెచ్చిపెట్టి తీవ్ర స్థాయిలో ఎదురు దాడి చేశారు నెటిజన్లు. కానీ మిగతా వైసీపీ నేతలు మాత్రం ఈవీఎంల పనితీరుపై సందేహాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

ఇలాంటి టైంలో ఓ వైసీపీ నాయకుడు మాత్రం భిన్నమైన స్వరం వినిపించారు. గత ఎన్నికల్లో జనసేన నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీలోకి జంప్ అయిన రాపాక వరప్రసాద్.. ఈవీఎంలపై వైసీపీ వాళ్లు చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. ఈసారి అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి చిత్తుగా ఓడిపోయిన రాపాక.. తాజాగా మీడియాతో మాట్లాడారు.

ఈవీఎం టాంపరింగ్ గురించి వస్తున్న ఆరోపణల గురించి ఆయన దగ్గర ఓ మీడియా ప్రతినిధి ప్రస్తావిస్తే.. అది శుద్ధ అబద్ధమని, అవి అర్థం లేని ఆరోపణలని కొట్టిపారేశారు. ఈసారి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా పోటీ చేశాయని.. అందువల్ల అన్ని పార్టీల ఓట్లు కలిసి కూటమి విజయం సాధించిందని.. ఇది క్లియర్‌గా కనిపిస్తుంటే ఇంకా ఈవీఎంల మీద ఆరోపణలు చేయడంలో అర్థం లేదని ఆయన తేల్చి పడేశారు. మరి పార్టీ స్టాండ్‌కు భిన్నంగా మాట్లాడిన రాపాక విషయంలో వైసీపీ అగ్రనాయకత్వం ఎలా స్పందిస్తుందో?