మాట ప్రకారం గౌరవ సభలో అడుగుపెట్టిన చంద్రబాబు

రెండున్నరేళ్ల క్రితం ఏపీ శాసన సభలో టీడీపీ అధినేత, నాటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబును వైసీపీ సభ్యులు ఘోరంగా అవమానించారు. 2021 నవంబరు 19న చంద్రబాబు ఈ కౌరవ సభను గౌరవ సభగా మార్చిన తర్వాతే వస్తానని శపథం చేశారు. ఈ కౌరవ సభలో తాను ఉండబోనని, ముఖ్యమంత్రిగా గెలిచి గౌరవ సభలో అడుగుపెడతానని అన్నారు. అన్న మాట ప్రకారం అఖండ విజయం తర్వాత చంద్రబాబు భావోద్వేగం నడుమ అసెంబ్లీలో అడుగుపెట్టారు.

అసెంబ్లీ మెట్లకు ప్రణామం చేసిన చంద్రబాబు శాసన సభలో ముఖ్యమంత్రి హోదాలో నాలుగోసారి అడుగుపెట్టారు. చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెట్టగానే టీడీపీ సభ్యులంతా ఘన స్వాగతం పలికారు. కౌరవ సభ పోయి గౌరవ సభ వచ్సింది అంటూ నినాదాలు చేశారు. సభలో అడుగు పెట్టిన క్షణంలో చంద్రబాబు ఎమోషనల్ అయ్యారు.

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ 16వ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అపాయింట్ చేసిన ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు. ముందుగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి, సభా సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా చంద్రబాబు ప్రమాణం చేశారు. ఆ తర్వాత జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తొలిసారి శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత మిగతా సభ్యులు అనిత వంగలపూడి, అచ్చెన్నాయుడు కింజారపు…ఇంగ్లిష్ ఆల్ఫాబెట్స్ క్రమంలో పేర్ల ప్రకారం ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.

అంతకుముందు, ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి చంద్రబాబు అసెంబ్లీకి వెళ్లారు. ఆ తర్వాత చంద్రబాబు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అసెంబ్లీలోని తన ఛాంబర్ లో అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే చంద్రబాబుకు పవన్ కల్యాణ్ పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.