ఎలా జస్టిఫై చేసుకుంటావ్ జగన్?

ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్లు అధికారం చెలాయించిన వైఎస్ జగన్ సర్కారు… తాము ఏం చేసినా చెల్లుతుందనే అహంకారంతో చేసిన పనులన్నీ ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారి ఆ పార్టీ మెడకు చుట్టుకుంటున్నాయి. 2019లో ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తన ఇంట్లో వినియోగిస్తున్న ఫర్నిచర్ విషయంలో ఎలా కేసులు పెట్టి వేధించారు, చివరికి ఆయన ఆత్మహత్యకు పాల్పడే స్థాయికి తీసుకొచ్చారు అన్నది తెలిసిందే.

ఇప్పుడు మాజీ సీఎం జగన్ సైతం ఇలాంటి వివాదంలోనే చిక్కుకుని తీవ్ర విమర్శల పాలవుతున్నారు. అప్పుడు కోడెల మీద పెట్టినట్లే జగన్ మీద కేసులు పెడితే తప్పేంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు సీఎంగా ఉండగా జగన్ ఇంటి ముందు మూడు రోడ్లను ఆక్రమించి రాకపోకలు లేకుండా నిషేధం విధించిన విషయం కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఇప్పుడు ఆ రోడ్లను జనం కోసం అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా ఆ రోడ్ల మీద జనాలతో మీడియా వాళ్లు మాట్లాడిస్తుంటే.. జగన్ చర్యల మీద వాళ్ల ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.

ఇలా అధికారంలో ఉండగా జగన్ అండ్ కో చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చి ఆ పార్టీ ఇమేజ్‌ను బాగా డ్యామేజ్ చేస్తున్నాయి. తాజాగా విశాఖపట్నంలోని రుషికొండ మీద జగన్ నిర్మించుకున్న విలాసవంతమైన భవనం తాలూకు వ్యవహారం ఇప్పుడు మీడియాలో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ బిల్డింగ్ కడుతున్నపుడు సీఎం క్యాంపు కార్యాలయం కోసమే దాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పుకున్నారు. ఇప్పుడేమో అది టూరిజం కోసం కట్టిన ప్రభుత్వ భవనం అంటూ మాట మార్చేశారు.

ఆ బిల్డింగ్ లోపల బాత్రూం కమోడ్, బాత్ టబ్ లాంటి వాటికి పెట్టిన లక్షల ఖర్చు గురించి తెలుసుకుని జనం అవాక్కవుతున్నారు. జనం సొమ్ముతో ఇంత విలాసవంతమైన భవనం కట్టుకుంటారా.. ఏకంగా 550 కోట్లు ఖర్చు పెడతారా అని ప్రజలు మంటెత్తిపోతున్నారు. శాశ్వతంగా తామే అధికారంలో ఉంటామని, తమను ఎవ్వరూ ఏమీ ప్రశ్నించలేరని జగన్ అండ్ కో ఇలా అడ్డగోలుగా వ్యవహరించినట్లు కనిపిస్తోంది. రుషికొండ ప్యాలెస్ సహా పలు అంశాల్లో జగన్ అండ్ కో అసలు ఏమని జస్టిఫై చేసుకుంటుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.