సామాన్యుడి సైన్యం.. రామోజీ!

ధ‌రిత్రి ఎరుగ‌ని చరిత్ర‌ను సొంతం చేసుకున్న నిత్యాక్ష‌ర చైతన్య శీలి రామోజీ. అఖండ తెలుగు నేలను నాలుగు ద‌శాబ్దాల‌కు పైగా.. నిష్పాక్షిక‌ అక్ష‌రాభిషేకంతో పునీతం చేసిన ఈనాడు అధిప‌తి రామోజీ. దిగ్దిగంతాల‌ను శాసించిన ఫాసిస్టుల దుర్నీతుల‌ను అక్ష‌రాయుధంతో ఏకేసి.. పేద‌ల ప‌క్షాన విప్ల‌వాత్మ‌క శ‌క్తిగా నిలిచిన అక్ష‌ర‌యోధుడు రామోజీ.

జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యుః అన్న‌ట్టు నేడు మ‌న నుంచి ఆయ‌న వెడ‌లి పోవ‌చ్చు. కానీ, స‌మాజంలోని స‌గ‌టు పౌరుల గ‌ళ‌మై.. పేద‌ల పాలిట బ‌ల‌మై.. బాధ్య‌తాయుత బ‌లిమై.. ఆయ‌న వేసిన అక్ష‌ర బీజాలు… నిత్య చైత‌న్యాలు… తిమిర సంహారాలు!!

ప్ర‌భుత్వాలు ఏవైనా.. పాల‌కులు ఎవరైనా.. ఈనాడు ల‌క్ష్యం.. పేద‌ల పాలిట క‌లం బలంగా నిల‌వ‌డ‌మే. దీనిలో ఎలాంటి సందేహం లేదు. గ‌ద్దె నెక్కే వ‌ర‌కే త‌న మ‌న‌..అనుకున్నా.. త‌ర్వాత అనుక్ష‌ణం.. క్ష‌ణ క్ష‌ణం.. పేద‌ల కోసం.. సామాజిక ఉద్య‌మంలో స‌హ‌భాగ‌స్వామ్యం కోసం.. త‌పించారు రామోజీ. సారా వ్య‌తిరేక ఉద్య‌మం ఉవ్వెత్తిన ఎగిసి ప‌డిన స‌మ‌యంలో ఈనాడు ముందు నిల‌బ‌డింది. అనేకానేక వ్యాసాలు… నిత్య చైత‌న్యాన్ని నింపే .. అనేక రూపాల్లో క‌థ‌నాల‌ను తీసుకువ‌చ్చారు.

సూర్యోద‌యంతోనే నిత్య‌స‌త్యం ఉద‌యించు గాక‌.. అన్న పీఠిక‌ను ఔద‌ల దాలుస్తూ.. రామోజీ చేసిన సామాజిక సంస్క‌ర‌ణ మహోద్య‌మాల్లో అనేకం ఉన్నాయి. ప్ర‌భుత్వాలు తీసుకునే నిర్ణ‌యాలు… చేసే ఖ‌ర్చులు.. తెచ్చే సొమ్ములు.. ఇలా.. అన్నీ ప్ర‌జ‌ల‌కు తెలిసి ఉండాల‌న్న‌.. ఉద్దేశంతో కేంద్ర ప్ర‌భుత్వం 2005లో స‌మాచార హ‌క్కు చ‌ట్టం తీసుకువ‌చ్చిన‌ప్పుడు.. ఈనాడు చేసిన కృషి అజ‌రామ‌రం.

దాదాపు నాలుగు సంవ‌త్స‌రాల పాటు.. ఈనాడు, ఈటీవీల్లో ప్ర‌త్యేక క‌థ‌నాలు ప్ర‌సారం చేయ‌డ‌మే కాకుండా.. స‌మాచార హ‌క్కు చ‌ట్టంపై ప్ర‌జ‌ల‌కు అవగాహ‌న క‌ల్పించ‌డంలోనూ రికార్డు సృష్టించింది.

సామాజిక రుగ్మ‌త‌ల‌పై పోరు స‌ల్ప‌డంలోనూ.. ఈనాడు పాత్ర అనిర్వ‌చ‌నీయం. ఎయిడ్స్ వంటి ప్ర‌మాద‌క ర జ‌బ్బులు వ్యాప్తిచెందిన‌ప్పుడు.. ఈనాడు చూపిన చొర‌వ‌.. మ‌హిళ‌లలో రొమ్ము కేన్స‌ర్‌పై చ‌ర్చించుకు నేందుకు సిగ్గు ప‌డే సంద‌ర్భంలో ఈనాడు తీసుకున్న ప్రాధాన్యం వంటివి స‌మాజంలో అనేక మార్పులు తీసుకువ‌చ్చాయి. సామాన్యుడి ప‌క్షాన నిల‌బడ‌డంతో అక్ష‌ర సాక్ష్యాలు అనేకం ఉన్నాయి.

పోలీసుల తీరును ఎండ‌గ‌డుతూ.. సామాన్యుడికి-పోలీసులు దూర‌మ‌వుతున్నారంటూ.. దండ ధ‌రుల కండ కావ‌రం`పేరిట ప్ర‌చురించిన సంపాద‌కీయం ద‌రిమిలా.. ఉమ్మ‌డి ఆంధ్ర ప్ర‌దేశ్‌లో తొలిసారిఫ్రెండ్లీ పోలీసింగ్‌“ అనే మాట వినిపించేలా చేసింది.

రెండు తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న స‌మ‌యంలోనూ త‌ట‌స్థంగా వ్య‌వ‌హ‌రించినా.. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అద్దం ప‌ట్టేలా రామోజీ వ్య‌వ‌హ‌రించారు. అమ‌రావ‌తి రాజ‌ధాని ఏర్పాటుకు అహ‌ర‌హం శ్ర‌మించారు.

రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ విధానంలో భూములు తీసుకున్న‌ప్పుడు.. వారి ప్ర‌యోజనాలు కాపాడ‌డంలో రామోజీ ఓ 100 సంవ‌త్స‌రాల భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకుని వ్య‌వ‌హ‌రించారు. ఫ‌లితంగా.. భూములు ఇచ్చిన రైతుల‌కు అప్ప‌టి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అనేక మేళ్లు చేసేందుకు ముందుకు వ‌చ్చింది.

రాజ‌ధాని అమ‌రావ‌తి లేద‌ని జ‌గ‌న్ పాల‌నా కాలంలో నిరంకుశ వ్యాఖ్య‌లు చేసిన‌ప్పుడు.. ఇదే ఈనాడు.. అక్ష‌ర శ‌త‌ఘ్నుల‌ను పేల్చి.. ఉద్య‌మాన్ని ఉవ్వెత్తున అంబ‌ర వీధి తాకేలా చేసింది. తెలుగు వాణి, బాణి.. అమ‌రావ‌తి నినాదంతో పుల‌కించి పోయేలా చేసింది.. ఈనాడే! వ‌ర‌ద‌లు క‌రువు వ‌చ్చిన‌ప్పుడు.. నేనున్నానంటూ.. బాధిత కుటుంబాలు ఆదుకున్న తొలి ప‌త్రిక ఈనాడు.

తాను ఇస్తూ.. ప‌దిమందితో ఇప్పించి.. పేద‌ల ప‌క్షాన నిలిచింది. అధికారులు, మంత్రుల‌కు అధికారిక సైన్యం ఉంటే.. పేద‌లకు అన‌ధికార పాత్రికేయ సైన్యాన్ని ఏర్పాటు చేసి.. వారికి ర‌క్ష‌ణ ఛ‌త్రాన్నిక‌ల్పించిన‌.. పేద‌ల సైన్యం ముమ్మాటికీ రామోజీనే అన‌డంలో ఎలాంటి సందేహం లేదు!!