త‌ప్పు చేసిన వారిని వ‌ద‌లేది లేదు: నారా లోకేష్‌

ఏపీలో కూట‌మి అధికారంలోకి వ‌చ్చింది. వైసీపీ తాజా ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాభ‌వంతో ఓడిపోయింది. ఇక‌, కూట‌మిలోనూ ప్ర‌తిపార్టీ ఘ‌నంగానే సీట్లు ఓట్లు రాబ‌ట్టుకుంది. దీంతో టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీలు చాలా హ్యాపీగా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌.. మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వ‌చ్చిన తర్వాత‌.. వైసీపీ హ‌యాంలో త‌ప్పుచేసిన వారిని వ‌దిలేది లేద‌ని తేల్చి చెప్పారు. అయితే.. ఇది క‌క్ష సాధింపు చ‌ర్య‌గా ఉండ‌బోద‌ని.. చ‌ట్ట ప్ర‌కార‌మే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయని చెప్పారు.

వైసీపీ చేసిన త‌ప్పుల కార‌ణంగా రాష్ట్రంలో 30 ఏళ్ల వెన‌క్కి వెళ్లిపోయిందని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. దీనిని గాడిలో పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు . ముందు దీనిపై ఎక్కువ‌గా దృష్టి పెట్ట‌నున్న‌ట్టు చెప్పా రు. ఇక‌, తాము వైసీపీ న‌డిచిన బాట‌లో న‌డిచేది లేద‌ని.. ప్ర‌భుత్వ ఆస్తుల‌ను ధ్వంసం చేసేది కూడా లేదని చెప్పారు. “ఆస్తులు సృష్టిస్తామే త‌ప్ప‌.. గ‌త ప్ర‌భుత్వం మాదిరిగా.. ధ్వంసం చేయం. ఎవ‌రిపైనా వేధింపుల‌కు పాల్ప‌డం” అని తేల్చి చెప్పారు.

అలానే.. ఎవ‌రిపైనా దొడ్డిదారిలో కేసులు పెట్ట‌బోమ‌ని చెప్పారు. నిబంధ‌న‌లు, చ‌ట్టం ఉల్లంఘించిన వారి పై మాత్రం చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. ఇక‌, ప్ర‌భుత్వ ప‌రంగా కేంద్రం నుంచి ఏపీకి ఏమేం రావా లో వాటిని స‌మీక‌రించేందుకు .. ప్ర‌య‌త్నిస్తామ‌ని చెప్పారు. ఎన్నిక‌ల స‌మయంలో ఇచ్చిన ప్ర‌తిహామీని నిల‌బెట్టుకుంటామ‌ని అన్నారు. ముఖ్యంగా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గాల్లో మోడ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంగా తీర్చి దిద్దేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌న్నారు.

అదేవిధంగా మంగ‌ళ‌గిరికి తాను ఇచ్చిన హామీల‌ను కూడా.. ప్రాధాన్య‌త ప్ర‌కారం అమ‌లు చేస్తామ‌న్నారు. మంగ‌ళ‌గిరిని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని నారా లోకేష్ తెలిపారు. ఇక‌, రాష్ట్ర ప్ర‌భుత్వంలో త‌న పాత్ర గురించి… మాట్లాడుతూ.. దీనిపై చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకుంటార‌ని.. ఈ విష‌యంలో ఆయ‌న తీసుకునే నిర్ణ‌య‌మే శిరోధార్య‌మ‌ని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. గ‌తంలో ఆయ‌న మంత్రిగా ప‌నిచేసిన‌ విష‌యం తెలిసిందే.