మోదీ ముహూర్తం ఖరారు .. టీడీపీకి ఎన్ని మంత్రి పదవులంటే ?!

దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించి ముహూర్తం ఫిక్స్ అయింది. జూన్ 8వ తేదీ రాత్రి 8గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. జవహర్ లాల్ నెహ్రు తరువాత వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన వ్యక్తిగా మోదీ రికార్డులకెక్కనున్నాడు.

2014 తరువాత తొలిసారిగా బీజేపీ పార్టీ అధికారం అందుకోవడానికి అవసరం అయిన మ్యాజిక్ ఫిగర్ 272ను దాటలేక పోయింది. దాంతో ఎన్డీయే కూటమి పక్షాల మద్దతుతో ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి ఇవాళ ఢిల్లీలో ఎన్డీయే పక్షాల కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, ఎన్డీయే పక్ష పార్టీల నేతలు పాల్గొంటారు. ఏపీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశానికి హాజరవుతున్నారు. ఈ మేరకు బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతుగా లేఖలు ఇవ్వనున్నారు.

ఈ పరిస్థితుల్లో ఎన్డీయేలో కేంద్ర మంత్రి పదవులకు డిమాండ్ పెరిగింది. ఏపీ నుంచి టీడీపీ కూటమికి 3 నుండి 5 మంత్రి పదువులు, జేడీయూకి 2 నుంచి మూడు, ఎల్జేపీకి రెండు కేంద్ర మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు హెచ్ఏఎం, అప్పాదళ్, శివసేన షిండే వర్గంకు ఒక్కో మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తున్నది. మరి చివరలకి ఏం జరుగుతుందో వేచిచూడాలి.