ఏపీ ఎన్నికల సెంటిమెంట్.. ఒకటి బ్రేక్.. మరొకటి కంటిన్యూ !

మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా.. రాజకీయ రంగంలో సెంటిమెంట్లకు కొదవ ఉండదు. ఫలానా చోట ఫలానా పార్టీ గెలిస్తే.. అధికారంలోకి వచ్చేది ఆ పార్టీ అని.. ఫలానా చోట ఏ పార్టీ అయితే ఓడితే.. ఆ పార్టీ ఖాయంగా గెలుస్తుందని.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. అయితే.. ఇలాంటి నమ్మకాలకు ఆయుష్షు పెద్దగా ఉండదు. కానీ.. కొన్ని సెంటిమెంట్లు మాత్రం దశాబ్దాలకు దశాబ్దాలుగా సాగుతూ ఉంటుంది.

అలాంటి రెండు సెంటిమెంట్లలో ఒకటి తాజాగా వెల్లడైన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బ్రేక్ అయితే.. మరొకటి మాత్రం కంటిన్యూ అవుతున్న వైనం ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీలో స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన వారు తర్వాతి ఎన్నికల్లో కచ్ఛితంగా ఓటమిపాలు అవుతారన్నది ఒక సెంటిమెంట్. ఉమ్మడి రాష్ట్రం నుంచి విభజిత రాష్ట్రం వరకు కూడా ఈ సెంటిమెంట్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పటివరకు ఒక్కసారంటే ఒక్కసారి కూడా బ్రేక్ పడింది లేదు. తాజా ఎన్నికల్లో అయినా అది బ్రేక్ అవుతుందని భావించారు. కానీ.. ఆ సెంటిమెంట్ కంటిన్యూ అయ్యింది.

ఏపీ స్పీకర్ గా తమ్మినేని సీతారాం వ్యవహరించారు. ఆయన తాజా ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. దీంతో ఏపీ స్పీకర్ గా వ్యవహరించిన వారు తర్వాతి ఎన్నికల్లో గెలవరన్న సెంటిమెంట్ మరోసారి నిజమైందని చెప్పాలి. విభజన తర్వాత తొలి ప్రభుత్వంలో స్పీకర్ గా వ్యవహరించారు కోడెల శివప్రసాద్. 2019లో ఆయన ఓటమిపాలు కావటమే కాదు. తెలుగుదేశం పార్టీ తమ అధికారాన్ని కోల్పోయింది. ఆయన సత్తెనపల్లి నుంచి పోటీ చేసి ఓడారు. కట్ చేస్తే.. తాజా ఎన్నికల్లో తమ్మినేని సీతారాం అముదాలవలస నుంచి పోటీ చేశారు. గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన ఆయన.. తాజా ఎన్నికల్లో మాత్రం ఓడారు. స్పీకర్ పదవిని చేపట్టిన తర్వాత ఓడిపోవటం ఖాయమన్న సెంటిమెంట్ మరోసారి నిజమైంది.

ఇక.. రెండో సెంటిమెంట్ విషయానికి వస్తే ఉరవకొండలో పయ్యావుల కేశవ్. కొన్ని దశాబ్దాలుగా ఈ సెంటిమెంట్ గురించి పదే పదే చెబుతుంటారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదనే సెంటిమెంట్ బలంగా ఉండేది.

ఇప్పటివరకు అదే జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే.. తాజాగా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పయ్యావుల కేశవ్ ఉరవకొండ నుంచి గెలవటం.. పార్టీ సైతం అత్యధిక మెజార్టీతో విజయం సాదించింది. దీంతో.. ఉరవకొండ సెంటిమెంట్ కు బ్రేక్ పడిందని చెప్పాలి.