చంద్రబాబుకు ఇది గొప్ప ఊరటే..

విభజన తర్వాత అసలే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం. దీనికి తోడు గత ఐదేళ్లలో వైసీపీ హయాంలో పరిశ్రమలు, పెట్టుబడులు అనేవి బాగా తగ్గిపోయాయి. సంపద సృష్టి అన్నదే పెద్దగా జరగలేదు. మరోవైపు సంక్షేమానికే ప్రాధాన్యం ఇస్తూ ఖజానాను ఖాళీ చేసేసింది జగన్ సర్కారు. హద్దులు మీరి అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసిందని జగన్ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంది. ఉన్న పథకాలకు, ఉద్యోగుల జీతాలకే నిధులు సరిపోని పరిస్థితి. ప్రతి నెలా అప్పులు తప్పట్లేదు.

ఈ నేపథ్యంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమికి అంత తేలిక కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్న పథకాలతోనే కష్టం అంటే.. కూటమి ఇంకా పెద్ద హామీలు ఇచ్చింది. వాటికి నిధులు ఎక్కడి నుంచి తెస్తుంది.. మరోవైపు రాజధాని, పోలవరం లాంటి ప్రాజెక్టులకు నిధులు ఎలా సమకూరుస్తుంది.. రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎలా గాడిలో పెడుతుంది అన్నది ప్రశ్నార్థకం.

ఐతే చంద్రబాబుకు ఉన్న ఇమేజ్ దృష్ట్యా వెంటనే కాకపోయినా.. రాష్ట్రంలోకి పరిశ్రమలు, పెట్టుబడులు పెరగడం ఖాయం. తద్వారా ఆదాయం, ఉపాధి పెరగొచ్చు. దీంతో పాటుగా సంపద సృష్టికి, ఆదాయం పెంచడానికి కొత్త మార్గాలు వెతకాలి. ఐతే రాష్ట్రం కొంచెం కుదురుకునే వరకు కేంద్రం నుంచి ఆర్థిక సహకారం చాలా అవసరం. ఒకవేళ మోడీ పార్టీ సొంతంగా మెజారిటీ సాధించి ఉంటే.. నిధులు తెచ్చుకోవడం కష్టమయ్యేది. కానీ ఇప్పుడు మోడీ సర్కారు టీడీపీ, జనసేనల మీద ఆధారపడుతోంది.

టీడీపీ లేదా జనతాదళ్.. ఈ రెంటిలో ఏది మద్దతు ఉపసంహరించుకున్నా మోడీ సర్కారుకు కష్టం కాబట్టి.. ఈ రెండు పార్టీలతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే. వాటి డిమాండ్లను తీర్చాల్సిందే. ఏపీకి న్యాయంగా రావాల్సిన వాటాలు ఇవ్వాలి. అలాగే ప్రాజెక్టులకు సాయం అందించాలి. ఇది చంద్రబాబు సర్కారుకు పెద్ద ఊరట కాబోతోంది. కేంద్రం నుంచి సహకారంలో ఉంటే కొంతలో కొంత ఉపశమనం ఉంటుంది. దీనికి తోడు చంద్రబాబు ఇమేజ్, ఆయన శ్రమ కూడా తోడైతే.. ఏపీకి మంచి రోజులు వచ్చినట్లే.