చంద్రబాబు వ్యూహం ఫలించిన తరుణం

దేశవ్యాప్తంగా విపరీతమైన చర్చకు దారి తీసిన ఏపీ ఎన్నికల ఫలితాలు అధిక శాతం ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టే రావడంలో ఆశ్చర్యం లేదు. కానీ అధికార వైసిపి మరీ ఇంత చేతులెత్తేసే స్థాయిలో వెనుకబడటం మాత్రం అధికార పార్టీ కార్యకర్తలు ఊహించలేదు. ఏదో టఫ్ ఫైట్ జరిగి ఉంటే పోరాడి ఓడామని సరిపెట్టుకోవచ్చు. కానీ పరిస్థితి అలా లేదు. జనంలో జగన్ సర్కారు మీద ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో ఓట్ల రూపంలో పబ్లిక్ స్పష్టమైన తీరు ఇచ్చేశారు. ఒక్కడిని, ఒంటరిని, మీ బిడ్డని అంటూ జగన్ చేసిన విన్నపాలు పులివెందులలో పని చేశాయేమో కానీ మిగిలిన చోట్ల మాత్రం వాటి ప్రభావం లేదు.

ఇక్కడ చంద్రబాబు నాయుడు వ్యూహం గొప్పగా ఫలించింది. ఎలక్షన్లు సమీపిస్తున్న టైంలో కక్షపూరిత ఉద్దేశాలతో చేసిన కుట్ర వల్ల జైలుకి వెళ్లాల్సి రావడం, జనసేనతో పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ ని తక్కువ సీట్లైనా సరే బలమైనవి ఇచ్చి ఒప్పించడం, బీజీపీతో దోస్తీకి అంగీకారం తెలుపడం, ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ప్రచారం చివరి రెండు మూడు వారాలు విపరీతంగా క్యాంపైన్లు నిర్వహించడం ఇవన్నీ అందులో భాగమే. లోకేష్ ని ఎక్కువ హైలైట్ చేయకుండా తాను, పవన్ మాత్రమే తెరముందు కనిపించేలా వేసుకున్న ప్రణాళిక జనసేన కార్యకర్తల్లో ఎలాంటి అపోహలకు తావు లేకుండా చేసింది.

టిడిపి జనసేనల ఓట్ల ట్రాన్స్ఫర్ వంద శాతం జరిగి తీరాలన్న రెండు పార్టీల నాయకుల సంకల్పం ఏపీలో అధికార మార్పిడికి దారి తీస్తోంది. తొలుత తమకు తక్కువ సీట్లు దక్కాయనే అసంతృప్తిలో ఉన్న జనసేన అభిమానుల మనసులను మార్చడంలో పవన్, చంద్రబాబులు సంయుక్తంగా విజయం సాధించారు. కలిసికట్టుగా జగన్ ని సాగనంపాలనే కాంక్షను తమ ప్రసంగాల ద్వారా రగిల్చారు. ముఖ్యంగా పవన్ తమకు ఎంత బలమయ్యింది చెప్పేందుకు చంద్రబాబు ఎప్పుడూ వెనుకాడలేదు. ఇటు పవన్ టీడీపీ అధినాయకుడి అనుభవాన్ని గొప్పగా వర్ణించుకుంటూ వచ్చారు. ఇప్పుడు చూస్తున్నది ఆ ఫలాలే.