ప్ర‌జెంట్‌ ఐఏఎస్ వ‌ర్సెస్ రిటైర్డ్ ఐఏఎస్‌!

ఏపీలో భూముల రాజ‌కీయం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఎన్నిక‌ల‌కు ముందు.. రాజ‌కీయ నేత‌లు చేసిన ప్ర‌చారంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశం ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఈ చ‌ట్టం ద్వారా.. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ మ‌రోసారి అధికారంలోకి వ‌స్తే.. భూములు దోచేస్తార‌ని.. పేద‌ల‌కు నిలువనీడ కూడా ఉండ‌బోద‌ని.. ప్ర‌తిప‌క్ష కూట‌మి పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసింది. ఇదే స‌య‌మంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి.. పీవీ ర‌మ‌ష్ కూడా.. దీనికి గొంతు క‌లిపారు. “ఔను.. నిజ‌మే.. నేను నానా ఇబ్బందులు ప‌డ్డాను. నాకే ఇన్ని ఇబ్బందులు ఉంటే.. సాధార‌ణ ప్ర‌జ‌ల మాటేంటి” అని ఆయ‌న ఎక్స్‌లో దుయ్య‌బ‌ట్టారు.

ఇది అప్ప‌ట్లో మ‌రింత చ‌ర్చ‌నీయాంశం అయింది. అయితే.. ఎన్నిక‌ల ముగిసిన త‌ర్వాత‌.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్య‌వ‌హారం.. తెర‌మ‌రుగైంది. దీనిపై ఎవ‌రూ స్పందించ‌డం లేదు. అయితే.. తాజాగా ప్ర‌స్తుత ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌వ‌హ‌ర్‌రెడ్డిపై జ‌న‌సేన నాయ‌కుడు.. పీత‌ల మూర్తి యాద‌వ్‌.. గ‌త రెండు రోజుల కింద‌ట సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌వ‌హ‌ర్ రెడ్డి కుమారుడు.. విశాఖ‌లో 800 ఎక‌రాల అసైన్ మెంట్ భూమిని బ‌ల‌వంతంగా తీసుకున్నార‌ని.. దీనికి సంబంధించిన అసైన్ చ‌ట్టాల‌ను కూడా.. జ‌వ‌హ‌ర్ రెడ్డి మార్పించుకున్నార‌ని.. అందుకే ఈ భూములు దోచుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

దీనిపై టీడీపీ నేత‌లు కూడా.. గ‌ళం క‌లిపారు. ఔను. నిజ‌మే.. అంటూ.. జ‌వ‌హ‌ర్ రెడ్డిపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. సీబీఐ విచార‌ణ‌కు కూడా ఆదేశించాల‌న్నారు. అయితే.. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన జ‌వ‌హ‌ర్‌రెడ్డి త‌న‌కు, త‌న కుటుంబానికి ముఖ్యంగా త‌న కుమారుడికి కూడా.. ఎక్క‌డా ఉత్త‌రాంధ్ర‌లో ఆస్తులులేవ‌న్నారు. మూర్తి యాద‌వ్‌పై తాను ప‌రువు న‌ష్టం కేసు దాఖ‌లు చేస్తాన‌ని చెప్పారు. ఈ వివాదం కొన‌సాగుతున్న స‌మ‌యంలోనే మ‌రోసారి మాజీ ఐఏఎస్‌.. పీవీ ర‌మేష్ ఎక్స్‌లో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ స‌ర్కారు తీసుకువ‌చ్చిన రెండు చ‌ట్టాలు(ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌, అసైన్‌మెంట్ యాక్ట్‌) కూడా న‌ల్ల చ‌ట్టాలుగా పేర్కొన్నారు. వీటిని ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు.

ముఖ్యంగా ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌వ‌హ‌ర్ రెడ్డిని కార్న‌ర్ చేస్తూ.. పీవీ ర‌మేష్ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. “1953లో ఆంధ్రప్రదేశ్ లో లక్షలాది ఎకరాలను పేదలకు .. జీవనోపాధి కోసం అసైన్ చేశారు. ఈ భూమి పూర్తిగా వారి జీవనోపాధి కోసమే కానీ అమ్మకానికి కాదు. ప్రస్తుత ప్రభుత్వం 2023లో అసైన్డ్ ల్యాండ్స్ చట్టానికి సవరణ చేసింది. ఈ చట్టం వల్ల పేద ఎస్సీ, ఎస్టీ, బీసీల అసైన్డ్ ల్యాండ్స్ ను ధనవంతులు, అధికార బలం(ప‌రోక్షంగా జ‌వ‌హ‌ర్‌రెడ్డి) ఉన్న వారు లాగేసుకునే అవకాశం ఏర్పడింది. ఏపీ ప్రభుత్వం 2023లో తీసుకు వచ్చిన చట్టం భూకబ్జాదారులకు ఓ వరంగా మారుతుంది. తక్షణం ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో పాటు అసైన్డ్ ల్యాండ్స్ చట్టాన్ని రద్దు చేయాలి“ అని పీవీ ర‌మేష్‌ డిమాండ్ చేశారు.