టార్గెట్ కేసీఆర్‌.. మూలాలు మారుతున్నాయా?

తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ పార్టీ.. పార్ల‌మెంటు ఎన్నిక‌ల వ‌ర‌కు చాలా మౌనంగా ఉంది. ఎన్నిక‌ల‌ను మాత్రమే రాజ‌కీయంగా చూసింది. విమ‌ర్శ‌లు-ప్ర‌తివిమ‌ర్శ‌లు.. స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు రువ్వుకుంది. ఇది ముగిసిపోయింది. అయితే.. ఇప్పుడు అస‌లు క‌థ మొద‌లు  పెట్టిందా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీనికి కార‌ణం.. మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఎంపిక చేసిన‌.. తెలంగాణ త‌ల్లి విగ్ర‌హం నుంచి రాష్ట్ర అధికారిక చిహ్నం వ‌ర‌కు.. స‌మూలంగా మార్పులు చేస్తున్నారు. దీనికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకోవ‌డం మ‌రింత రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం అయింది.

ఎందుకు?

ప్ర‌స్తుతం రేవంత్ ప్ర‌భుత్వం తెలంగాణ త‌ల్లి విగ్ర‌హంలో మార్పులు చేయించారు. కానీ, దీనిని తొలినాళ్ల‌లో అప్ప‌టి సీఎం కేసీఆర్ ముచ్చ‌ట‌ప‌డి మ‌రీ.. చేయించుకున్నారు. దీనికి ఆయ‌న పెద్ద అధ్య‌య‌న‌మే చేయించారు. అనేక విమ‌ర్శ‌లు.. ప్ర‌తి విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. మా త‌ల్లి మాయిష్టం అంటూ.. కౌంట‌ర్లు ఇచ్చారు. అంటే.. ఒక ర‌కంగా.. తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాన్ని చూస్తే.. వెంట‌నే కేసీఆర్ గుర్తుకు వ‌స్తారు. ఇదే.. ఇప్పుడు మార్పున‌కు దారితీసింద‌నే.. వాద‌న వినిపిస్తోంది.

ఇక‌, రాష్ట్ర అధికార చిహ్నంలోనూ మార్పులు చేయిస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. అధికార చిహ్నంలో ఓరుగ‌ల్లు కోట ముఖ చిత్రం ఉంది. ఇది రాజ‌కీయ వంశాల‌కు చిహ్న‌మ‌ని.. కాబ‌ట్టి తొల‌గిస్తున్నామ‌ని అన్నారు. అంతేకాదు.. ఇప్పుడు మ‌రిన్ని మార్పులు చేయిస్తున్నారు. ప్రముఖ చిత్రకారుడు రుద్ర రాజేశం రాష్ట్ర అధికార చిహ్నాన్ని తీర్చిదిద్దుతున్నారు. దీనిని కూడా జూన్ 2 న ఆవిష్క‌రించనున్నారు. అయితే.. ఇది కూడా అప్ప‌టి సీఎం కేసీఆర్ ద‌గ్గ‌రుండి.. చేయించుకున్న చిహ్నం. ఇప్పుడు దీనిలోనూ కేసీఆర్ జాడ‌లు క‌నిపించ‌వ‌నే వాద‌న వినిపిస్తోంది.

ఇక‌, తెలంగాణ అధికారిక గీతం. ఈ విష‌యంలో కేసీఆర్ వెనుక‌బ‌డ్డారు. అధికారంలో ఉన్న‌పదేళ్ల‌లో ఆయ‌న గీతం చేయించాల‌ని అనుకున్నా.. ఎప్పుడూ.. ఆయ‌న ప్ర‌త్యేక దృష్టి పెట్ట‌లేదు. ఇక‌, రేవంత్ వ‌చ్చీ రావ‌డంతోనే.. గీతంపై ప్ర‌త్యేక దృష్టి పెట్టారు. ఏపీకి చెందిన సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి మ‌న‌కెందుకు? అన్న విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. ఆయ‌న వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఇక‌, అందెశ్రీరాసిన గీతం.. దాదాపు కంపోజ్ రికార్డింగ్ కూడా అయిపోయింది. మొత్తానికి ఈ మూడు ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. తెలంగాణ‌పై కేసీఆర్ క‌న్నా.. రేవంత్ ముద్ర ఎక్కువ‌గా క‌నిపించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.