తారక్ ఫ్యాన్స్‌ను గిల్లుడు అవసరమా?

రాజకీయాల్లో గెలుపు అత్యవసరం అయినపుడు అందరూ కావాలి. నాయకులు అందరినీ మచ్చిక చేసుకోవడానికే ప్రయత్నిస్తారు. కానీ గెలుపు ఖాయం అయినపుడు, గెలిచేశాక కొందరిని తక్కువ చేసేలా మాట్లాడతారు. తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే 2014లో పవన్ కళ్యాణ్ సాయంతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. కానీ తర్వాత ఆ పార్టీ నేతలు పవన్‌ను తక్కువ చేసి మాట్లాడడం వివాదాస్పదమైంది.

కట్ చేస్తే ఇప్పుడు ఎన్నికలు అయి ఇంకా ఫలితాలు రాకముందే జూనియర్ ఎన్టీఆర్ మీద మాట తూలారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. టీడీపీకి తారక్‌కు సంబంధం లేదని.. పార్టీకి ఆయన అవసరం లేదని తేల్చేశారు. ఐతే ఎంత ఎన్నికల్లో గెలిచేస్తామని కాన్ఫిడెన్స్ ఉన్నా సరే.. ఇప్పుడిలాంటి వ్యాఖ్యలు చేయడం అవసరమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఎన్నికలకు ముందు విజయం కోసం తెలుగుదేశం ఎంత తపించిందో అందరికీ తెలుసు. ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడానికి ఇష్టపడలేదు. ప్రతి వర్గాన్నీ మెప్పించడానికి ప్రయత్నించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. చివరికి వైసీపీకి పూర్తి అనుకూలమైన వాలంటీర్ల మీద కూడా వరాలు గుప్పించే ప్రయత్నం చేశారు బాబు. ఇది టీడీపీ డెస్పరేషన్‌ను సూచించేదే.

గెలుపు కోసం ఎన్నికల ముంగిట అంతగా తపన పడ్డారు. ఆచితూచి వ్యవహరించారు. అలాంటిది ఎన్నికలు అవగానే ఇప్పుడు ఆ పార్టీ నేత బుద్ధా వెంకన్న ఎన్టీఆర్‌ను తక్కువ చేసి మాట్లాడారు. తారక్ ఫ్యాన్స్‌ను హర్ట్ చేశారు. దీని మీద సోషల్ మీడియాలో డిబేట్లు నడుస్తున్నాయి. ఇవే మాటలు ఎన్నికలకు ముందు మాట్లాడాల్సిందంటూ తారక్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. టీడీపీ మద్దతుదారులు వారిని కవ్వించేలా పోస్టులు పెడుతున్నారు. ఐతే ఎన్నికల్లో విజయం ఖాయం అయ్యేసరికి పనిగట్టుకుని టీడీపీ వాళ్లు ఇప్పుడిలా తారక్ ఫ్యాన్స్‌ను గిల్లడం అవసరమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.